ద్రవ్యలోటును కట్టడి చేస్తాం | Chidambaram confident of restricting fiscal deficit to 4.8% | Sakshi
Sakshi News home page

ద్రవ్యలోటును కట్టడి చేస్తాం

Jan 3 2014 1:50 AM | Updated on Apr 6 2019 9:38 PM

ద్రవ్యలోటును కట్టడి చేస్తాం - Sakshi

ద్రవ్యలోటును కట్టడి చేస్తాం

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటును జీడీపీలో 4.8%కు లోపు కట్టడి చేయగలమని ఆర్థిక మంత్రి పి. చిదంబరం తాజాగా స్పష్టం చేశారు.

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటును జీడీపీలో 4.8%కు లోపు కట్టడి చేయగలమని ఆర్థిక మంత్రి పి. చిదంబరం తాజాగా స్పష్టం చేశారు. 4.8% దాటి తే ఆందోళనకరమని, అయితే దీనిని దాటబోమన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కాగా, ఈ నవంబర్ చివరికి బడ్జెట్ అంచనాల్లో 94%కు ద్రవ్యలోటు చేరిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై స్పందిస్తూ చిదంబరం డిసెంబర్‌లో ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని, వెరసి లోటు తగ్గుముఖం పడుతుందని వివరించారు. డిసెంబర్‌లో ముందస్తు పన్ను చెల్లింపులు వసూలుకావడంతోపాటు, ప్రభుత్వ వ్యయాలు క్షీణిస్తాయని చెప్పారు. దీంతో ద్రవ్యలోటుకు కళ్లెం పడుతుందని పేర్కొన్నారు. ఈ ఏడాదికి ద్రవ్యలోటును జీడీపీలో 4.8%కు పరిమితం చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ బాటలో 2016-17కల్లా 3%కు తగ్గించాలని భావిస్తోంది. గడిచిన ఏడాది (2012-13)లో లోటు 4.9%గా నమోదైన సంగతి తెలిసిందే.
 
 కష్టమే...
 ఆదాయాలు క్షీణించడం, డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యాన్ని సాధించలేకపోవడం వంటి అంశాల నేపథ్యంలో ద్రవ్యలోటును కట్టడి చేయడం ప్రభుత్వానికి కష్టతరమైన అంశంగా నిలవనుంది. లోటు కట్టడికి ప్రణాళికా వ్యయాలను రూ. లక్ష కోట్లమేర ప్రభుత్వం తగ్గించుకోవలసి ఉంటుంది. డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ. 40,000 కోట్ల సమీకరణ లక్ష్యం కాగా, ప్రభుత్వం కేవలం రూ. 3,000 కోట్లను సమకూర్చుకోగలిగింది. ఏప్రిల్-నవంబర్’13 కాలంలో ద్రవ్యలోటు రూ. 5,09,557 కోట్లకు చేరింది. ఇది వార్షిక లక్ష్యంలో దాదాపు 94%కాగా, గతేడాది ఇదే కాలానికి 80% స్థాయిలో లోటు నమోదైంది. ఈ ఏడాదికి ఆదాయాలు, వ్యయాల మధ్య లోటును రూ. 5,42,499 కోట్లకు పరిమితం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement