చెన్నై ఎక్స్ప్రెస్ రైలులో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్కు చెందిన 42 తులాల బంగారు ఆభరణాల బ్యాగు గురువారం చోరీకి గురైంది.
సికింద్రాబాద్: చెన్నై ఎక్స్ప్రెస్ రైలులో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్కు చెందిన 42 తులాల బంగారు ఆభరణాల బ్యాగు గురువారం చోరీకి గురైంది. రైలు నల్లగొండ దాటాక గుర్తించిన బాధితుడు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్కు చేరుకుని జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హైదరాబాద్లోని హైటెక్ సిటీలో నివాసం ఉంటున్న రమాకాంత్ తన భార్యతో కలసి చెన్నై నుంచి రైలులో సికింద్రాబాద్ బయలుదేరాడు. బుధవారం అర్ధరాత్రి దాటాక భార్యభర్తలు ఇద్దరు రైలులో నిద్రపోతున్న సమయంలో లగేజీ బ్యాగు మాయమైంది.
తెల్లవారుజామున ఈ విషయాన్ని గుర్తించిన రమాకాంత్ సికింద్రాబాద్లో పోలీసులను ఆశ్రయించాడు. నల్లగొండ ప్రాంతంలో బ్యాగును దొంగిలించిన ఆగంతకులు అందులోని ఆభరణాలు తీసుకుని బ్యాగును రైల్వేస్టేషన్ ప్రాంతంలో పడేసినట్లు జీఆర్పీ పోలీసులు గుర్తించారు. అందులో లభించిన చిరునామా ఆధారంగా సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులకు సమాచారం అందించారు. తదుపరి విచారణ నిమిత్తం కేసును నల్లగొండకు బదిలీ చేశారు.