కొత్త ఏడాదంతా ఫ్రీ 4జీ డేటా..ఎలాగంటే
ఉచిత ఆఫర్లతో రిలయన్స్ జియో దూసుకెళ్తుండగా.. కొత్త ఏడాదిలో ఆ కంపెనీకి షాకిచ్చేందుకు టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ సిద్ధమైంది.
ఉచిత ఆఫర్లతో రిలయన్స్ జియో దూసుకెళ్తుండగా.. కొత్త ఏడాదిలో ఆ కంపెనీకి షాకిచ్చేందుకు టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ సిద్ధమైంది. తమ 4జీ నెట్వర్క్లోకి మారే కస్టమర్లకు కొత్త ఏడాదంతా ఉచిత డేటా అందించనున్నట్టు ప్రకటించింది. 4జీ మొబైల్ హ్యాండ్సెట్ కస్టమర్లందరికీ ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. ఈ ఆఫర్ కింద ఎంపికచేసిన ప్రీపెయిడ్, పోస్ట్పెయిడ్ ప్యాక్స్నూ ఈ కొత్త ఏడాది డిసెంబర్ చివరి వరకు ప్రతి నెలా 3జీబీ డేటాను ఉచితంగా ఎయిర్టెల్ అందించనుంది. కంపెనీ ప్యాక్ ప్రయోజనాలకు ఈ ఉచిత డేటా తక్కువగా లేదా ఎక్కువగానూ ఉండొచ్చని కంపెనీ పేర్కొంది. అందుబాటులోని ధరలకు యూజర్లకు 4జీ నెట్వర్క్ అనుభవం పొందడానికి ఈ ఆఫర్ను తీసుకొస్తున్నట్టు కంపెనీ చెప్పింది.
ఈ ఉచిత డేటా ఆఫర్ కింద అన్ని రకాల ప్రయోజనాలు యూజర్లకు అందించనున్నట్టు, ఫిబ్రవరి 28లోపల ఎయిర్టెల్లోకి మారే కస్టమర్లకు ఈ ఆఫర్ అందించనుందని వెల్లడించింది. రేపటి నుంచి ఆ ఆఫర్ అందుబాటులోకి వస్తోంది. ఫిబ్రవరి 28తో ఈ ఆఫర్ గడువు ముగియనుంది. అప్పటివరకు ఎయిర్టెల్ 4జీ నెట్వర్క్లోకి మారాలని సూచించింది. కొత్త 4జీ హ్యాండ్సెట్లోకి అప్గ్రేడ్ అయ్యే ప్రస్తుత ఎయిర్టెల్ కస్టమర్లకూ ఇది వర్తించనుంది. టెలికాం ఇండస్ట్రిలో గుబేలు పుట్టిస్తూ మళ్లీ రిలయన్స్ జియో తన ఉచిత ఆఫర్లను మార్చి 31వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. 2017 మార్చి తర్వాత మళ్లీ జియో తన ఆఫర్లను పొడిగించాలని యోచిస్తుందని టెలికాం విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో జియోకు పోటీగా టెలికాం దిగ్గజాలు ఉచిత ఆఫర్లకు సన్నద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే ఎయిర్టెల్ ఈ ఉచిత డేటా ఆఫర్ను ప్రకటించింది.