అణు బాంబు వేస్తాం: పాకిస్తాన్
పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా మహమ్మద్ ఆసిఫ్ తప్పులో కాలేశారు.
న్యూఢిల్లీ: పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా మహమ్మద్ ఆసిఫ్ తప్పులో కాలేశారు. పాకిస్తాన్ పై అణుదాడి చేస్తామని ఇజ్రాయెల్ పేర్కొన్నట్లు వచ్చిన పుకార్లను నమ్మిన ఆయన పాకిస్తాన్ ఇజ్రాయెల్ పై అణుబాంబుల వర్షం కురిపిస్తుందని అన్నారు. సిరియాలో పాకిస్తాన్ సేనలను మొహరిస్తే అందుకు ప్రతిగా అణుదాడి చేస్తామని ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి పేర్కొన్నట్లు పుకార్లు వచ్చాయి.
వాటిని నమ్మిన ఆసిఫ్.. ఇజ్రాయెల్ ఒక్కటే అణు శక్తి కలిగిన దేశం కాదని పాకిస్తాన్ కూడా అణుశక్తి కలిగిన రాజ్యమేనని తన ట్విట్టర్ హ్యాండిల్లో పేర్కొన్నారు. awdnews.com అనే వెబ్ సైట్లో ఇజ్రాయెల్ పాకిస్తాన్ పై అణుదాడి చేస్తోందని ఆ దేశ మాజీ రక్షణ శాఖ మంత్రి మొషే యాలన్ అన్నట్లు వార్త వచ్చింది. వీటిపై స్పందించిన ఇజ్రాయెల్ రక్షణ శాఖ ఆ వార్త సత్యదూరమని పేర్కొంది. ఈ మేరకు ట్విట్టర్ లో ఆసిఫ్ కు రీట్వీట్ కూడా చేసింది. యాలన్ అలాంటి వ్యాఖ్యలేవీ చేయలేదని పేర్కొంది.