పాఠశాలలో జాతీయగీతాన్ని ఆలపించొద్దని.. | 8 teachers quit after being told not to sing National Anthem on I-Day | Sakshi
Sakshi News home page

పాఠశాలలో జాతీయగీతాన్ని ఆలపించొద్దని..

Aug 7 2016 5:03 PM | Updated on Oct 9 2018 5:34 PM

స్వతంత్ర దినోత్సవం నాడు విద్యార్థులు జాతీయగీతాన్ని ఆలపించొద్దని ఓ పాఠశాల మేనేజర్ ఆదేశాలు జారీ చేసిన సంఘటన వివాదాస్పదమైంది.

అలహాబాద్: స్వతంత్ర దినోత్సవం నాడు విద్యార్థులు జాతీయగీతాన్ని ఆలపించొద్దని ఓ పాఠశాల మేనేజర్ ఆదేశాలు జారీ చేసిన సంఘటన వివాదాస్పదమైంది. దాంతో పాఠశాలలో పనిచేసే ఏడుగురు ఉపాధ్యాయులతో పాటు ప్రిన్సిపాల్ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. నగరంలోని బఘారాలో ఉన్న జియా-ఉల్-హక్ పాఠశాలలో వందేమాతరం, సరస్వతి వందనాలను కూడా స్కూల్  మేనేజర్ నిషేధించారు.

జాతీయ గీతం కులానికి వ్యతిరేకంగా ఉందని.. దాన్ని పాఠశాలల్లో విద్యార్థులతో పాడించకూడదని మేనేజర్ వ్యాఖ్యానించారు. నగరంలో మేనేజర్ గుర్తింపు లేని రెండు పాఠశాలలను నడుపుతున్నారు. బఘారాలోని స్కూల్లో 330 విద్యార్థులు, 20 మంది టీచర్లు పనిచేస్తుండగా.. శుక్రవారం మేనేజర్ వివాదాస్పద వ్యాఖ్యలతో ఒకే సామాజిక వర్గానికి చెందిన 8 మంది రాజీనామా చేశారు.

స్వతంత్ర దినోత్సవం తేదీ దగ్గరపడుతుండటంతో పాఠశాలలో సంబరాలకు ఏర్పాట్లుపూర్తి చేసి మేనేజర్ కు ఇచ్చినట్లు ప్రిన్సిపాల్ రీతూ శుక్లా చెప్పారు. వాటిని పరిశీలించిన మేనేజర్ వందేమాతరం, సరస్వతి వందనం, జాతీయ గీతాల్లో ఓ సామాజిక వర్గానికి వ్యతిరేకంగా పదాలు ఉన్నాయని పేర్కొన్నట్లు తెలిపారు. విద్యార్థులతో వీటిని పాడించడానికి వీల్లేదని చెప్పినట్లు వివరించారు. దీనిని వ్యతిరేకించిన వాళ్లందరూ స్కూల్ నుంచి వెళ్లిపోవచ్చని చెప్పినట్లు తెలిపారు. దాంతో ఎనిమిది టీచర్లు రాజీనామా చేశారని చెప్పారు.

జాతీయ గీతంలోని 'భారత భాగ్య విధాత' అనే వరుసలో భారతదేశం దైవం కాదని, అల్లానే దైవమని మేనేజర్ వ్యాఖ్యనించినట్లు వివరించారు.  జాతీయగీతాన్ని ఆలపించొద్దని విద్యార్థులు, టీచర్లను అడ్డగించే హక్కు ఎవరికీ లేదని.. జియా-ఉల్-హక్ స్కూల్ మేనేజర్ ను విచారించి తగిన చర్యలు తీసుకుంటామని ఉత్తరప్రదేశ్ ప్రధాన కార్యదర్శి దీపక్ సింఘాల్ స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement