రంగారెడ్డి షాబాద్‌లో కిరాతకం.. పోక్సో కేసు కక్షతో ఆరుగురి హత్య | Ranga Reddy Horror Man Kills Wife Two Children and 3 Others Over POCSO Case Grudge | Sakshi
Sakshi News home page

రంగారెడ్డి షాబాద్‌లో కిరాతకం.. పోక్సో కేసు కక్షతో ఆరుగురి హత్య

Jul 11 2026 5:04 AM | Updated on Jul 11 2026 11:18 AM

Ranga Reddy Horror Man Kills Wife Two Children and 3 Others Over POCSO Case Grudge

సాక్షి, షాబాద్: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడ గ్రామంలో శనివారం తెల్లవారుజామున రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేసిన సామూహిక హత్యలు చోటుచేసుకున్నాయి. తనపై పోక్సో కేసు నమోదు చేశారనే కక్షతో ఓ వ్యక్తి మొత్తం ఆరుగురిని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. మృతుల్లో తనపై ఫిర్యాదు చేసిన బాలిక, ఆమె తల్లి, నానమ్మతో పాటు తన భార్య, మూడేళ్ల కుమార్తె, రెండేళ్ల కుమారుడు ఉండటం గమనార్హం.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రాజ్‌కుమార్‌పై ఓ బాలికను(17) వేధించాడంటూ ఈ ఏడాది మే 16న బాధిత బాలిక తల్లి ఫిర్యాదు చేసింది. పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి మే 26న అరెస్టు చేశారు. అనంతరం శుక్రవారం అతడు బెయిల్‌పై విడుదలై గ్రామానికి తిరిగి వచ్చాడు. 

శనివారం తెల్లవారుజామున.. సరాసరి తన ఇంటికి వెళ్లి భార్య సరిత (30), మూడేళ్ల కుమార్తె పరీక్షిత్‌, రెండేళ్ల కుమారుడు రుద్రవాన్స్‌లను కత్తితో పొడిచి హతమార్చాడు. అనంతరం నేరుగా బాధిత కుటుంబం ఇంటికి వెళ్లి.. బాధితురాలి తల్లి చిట్యాల లక్ష్మి, నానమ్మ చిట్యాల రుక్కమ్మ (65)లను అదే కత్తితో కిరాతకంగా హతమార్చాడు. ఆపై బాధిత బాలికను ఎత్తుకెళ్లి ఊరి శివారులో అత్యాచారం జరిపి మరీ హత్య చేశాడు. 

హత్యల అనంతరం రాజ్‌కుమార్‌ తన తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి.. తాను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో షాబాద్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.  ఈ దారుణం గ్రామాన్ని భయాందోళనలకు గురిచేసింది.

ప్రాథమిక విచారణలో పోక్సో కేసుపై కక్షే ఈ సామూహిక హత్యలకు కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. బాలికను రాజ్‌కుమార్‌ ఎత్తుకెళ్లిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్యల్లో ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకుని అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. పరారీలో ఉన్న దుర్మార్గుడి కోసం గాలింపు చేపట్టారు. 

నగర పోలీసు కమిషనర్‌ తరుణ్‌ జోషి, డీసీపీ యోగేష్‌ గౌతమ్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. రాష్ట్రంలో ఇటీవలి కాలంలో చోటుచేసుకున్న అత్యంత దారుణమైన సామూహిక హత్యల ఘటనల్లో ఇదొకటిగా పోలీసులు పేర్కొంటున్నారు. 

ఈ ఘటనతో దైవాలగూడ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఒకేరోజు ఆరుగురు ప్రాణాలు కోల్పోవడంతో గ్రామస్తులు షాక్‌కు గురయ్యారు. అదే సమయంలో.. నిందితుడి విషయంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాక్షసుడు రాజ్‌కుమార్‌ తన కుటుంబాన్నిఎందుకు కడతేర్చాడనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. మృతదేహాల్ని పోస్ట్‌మార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement