సౌదీలో చిక్కుకున్న గొర్రెల కాపరి
హైకోర్టును ఆశ్రయించిన తల్లి
విచారణ చేపట్టిన హైకోర్టు
కరీంనగర్, జగిత్యాల: జగిత్యాల జిల్లాలోని బీబీరాజ్పల్లెకి చెందిన దాసరి అరవింద్ సౌదీ అరేబియాలో చిక్కుకున్న విషయం తెల్సిందే. తన కొడుకును కాపాడాలంటూ ఆయన తల్లి దాసరి రాజవ్వ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ చేపట్టిన హైకోర్టు జడ్జి విజయసేన్రెడ్డి ప్రతివాదులైన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి, ప్రొటెక్షన్ ఎమిగ్రేట్స్ (పీజీఈ), సౌదీ రాజధాని రియాద్లోని ఇండియన్ ఎంబసీ ప్రతినిధి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జీఐడీ, ఎన్ఆర్ఐ ముఖ్య కార్యదర్శి, డీజీపీకి నోటీసులు జారీ చేశారు.
కేసు విచారణను ఈనెల 16కు వాయిదా వేశారు. అరవింద్ను ఓ ఏజెంట్ సౌదీలో ప్యాకింగ్ వర్కర్గా ఉద్యోగం కల్పిస్తామని పంపించాడు. అక్కడికి చేరుకున్నాక రియాద్కు సుమారు 950 కిలోమీటర్ల దూరంలో ఎడారి ప్రాంతంలో గొర్రెల కాపరిగా పనిచేయిస్తున్నారు. తన దుర్భర పరిస్థితులను అరవింద్ వీడియో ద్వారా కుటుంబసభ్యులకు పంపించాడు. ఈ విషయం కంపెనీ యాజమాన్యానికి తెలియడంతో అతని వద్దనున్న మొబైల్, సిమ్కార్డు స్వాధీనం చేసుకోవడంతో అతని భద్రతపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.


