రూ.7.8 కోట్ల మేర మోసం చేశారని ఫిర్యాదు
సీసీఎస్ను ఆశ్రయించిన బెంగళూరు వ్యాపారి
సాక్షి, హైదరాబాద్: సోమాజీగూడ కేంద్రంగా కేవీ జ్యువెలర్స్, నితిన్ జ్యువెలర్స్, కేవీవీ జ్యువెలర్స్, నితిన్ ఎంటర్ప్రైజెస్ సంస్థల్ని నిర్వహించిన నితిన్ గులాబానిపై నగర నేర పరిశోధన విభాగంలో (సీసీఎస్) మరో కేసు నమోదైంది. బెంగళూరుకు చెందిన వ్యాపారి రూ.7.8 కోట్ల మేర మోసపోయానంటూ ఇచ్చిన ఫిర్యాదుతో దీన్ని రిజిస్టర్ చేశారు. ఇప్పటికే నగరానికి చెందిన నలుగురు జ్యువెలరీ దుకాణం యజమానుల్ని రూ.20.59 కోట్లకు మోసం చేసిన ఆరోపణలతో నితిన్పై ఓ కేసు నమోదైన విషయం విదితమే.
బెంగళూరులోని బెంగళూరు జ్యువెలరీ హౌస్ ముఖేష్ కుమార్ జైన్ నిర్వహిస్తున్నారు. గత ఏడాది మార్చి 22న బెంగళూరు ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్లో జరిగిన ఆభరణాల ప్రదర్శనలో ముఖేష్ను నితిన్ రమేష్ గులాబానీ కలిశాడు. తాను హైదరాబాద్లోని మూడు సంస్థలకు యజమానని పరిచయం చేసుకున్నాడు. ముఖేష్ను తన స్టాల్కు తీసుకెళ్లిను నితిన్ వ్యాపార సంబంధాలు ఏర్పరుచుకున్నాడు. తొలినాళ్లల్లో బంగారు ఆభరణాలు సరఫరా చేసిన 30 రోజుల్లోపు నితిన్ చెల్లింపులు చేస్తుండేవాడు. రెండు లావాదేవీలను ఇలానే పూర్తి చేసి తనపై పూర్తి నమ్మకం తెచ్చుకున్నాడు.
ఈ ఏడాది మార్చి 30న రూ.3.68 కోట్ల విలువైన 2503.190 గ్రాముల బంగారు ఆభరణాలు, ఏప్రిల్ 1న రూ.3.16 కోట్ల విలువైన 2207.600 గ్రాముల బంగారు ఆభరణాలు సరఫరా చేశారు. ఈ సరుకుని ముఖేష్ వద్ద పని చేసే శ్రవణ్, సంజయ్ హైదరాబాద్ తీసుకువచ్చి నితిన్ జ్యువెలర్స్ కార్యాలయంలో అందించారు. ఆపై మే 19న రూ.4.41 కోట్ల విలువైన 2927.250 గ్రాముల బంగారు ఆభరణాలను ముఖేష్ స్వయంగా తీసువచ్చి ఇవ్వగా... జూన్ 2న రూ.2.90 కోట్ల విలువైన 1808.180 గ్రాముల బంగారు ఆభరణాలను నితిన్ గులాబానీ కార్యాలయంలో ముఖేష్ ఉద్యోగులు హరీష్, ధన్రాజ్లు అందించారు.
గరిష్టంగా 30 రోజుల్లో చెల్లింపులు చేయాల్సి ఉండగా నితిన్ అలా చేయలేదు. ముఖేష్కు చెల్లించాల్సిన రూ.13.81 కోట్ల బకాయిలో కేవలం రూ.5.95 కోట్లు మాత్రమే చెల్లించాడు. మిగిలిన రూ.7.86 కోట్ల కోసం పలుమార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. ముఖేష్ బెంగళూరులో ఉండటంతో ఆయన ఉద్యోగులను పదేపదే హైదరాబాద్ వచ్చి నితిన్ను అడిగినా ఫలితం దక్కలేదు. ప్రతిసారీ నితిన్తో పాటు ఆయన సిబ్బంది త్వరలోనే మొత్తం చెల్లిస్తామని చెప్పేవారు. కొన్ని సందర్భాల్లో నితిన్ తాను ఆస్పత్రిలో ఉన్నారని చెప్పి, బకాయితో పాటు ఆలస్యమైనందుకు నెలకు 2 శాతం వడ్డీ కూడా చెల్లిస్తానని నమ్మబలికాడు.
కొన్నాళ్లకు నితిన్ గులాబానీతో పాటు ఆయన సోదరుడు విపిన్, సిబ్బంది హరీష్, ధన్రాజ్ సింగ్ ప్రవర్తన పూర్తిగా మారిపోవడాన్ని ముఖేష్ గమనించారు. ఫోన్కాల్స్, వాట్సాప్ సందేశాలకు స్పందించడం మానేశారు. దీంతో జూన్ 17న ముఖేష్ స్వయంగా హైదరాబాద్కు వచ్చి నితిన్ గులాబానీని కలిశారు. మరుసటి రోజు కనీసం రూ.2 కోట్లు చెల్లిస్తానని ఆయన హామీ ఇవ్వడంతో మరుసటి రోజు ముఖేష్ కార్యాలయానికి వెళ్లారు. అప్పుడు ఆ కార్యాలయం మూసి ఉండటం, నితిన్ మొబైల్ స్విచ్ ఆఫ్లో ఉండటాన్ని గమనించారు. ఆయన ఉద్యోగుల ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్లోనే ఉండటంతో ముఖేష్కు అనుమానం వచ్చింది. దీంతో ఆయన నితిన్ నివాసానికి వెళ్లి చూడగా అది తాళం వేసి ఉంది. మోసపోయానని గుర్తించిన బాధితుడు సీసీఎస్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.


