వైఎస్‌ఆర్ సీపీ అభ్యర్థుల నామినేషన్లు | ysrcp candidates submitted their nominations | Sakshi
Sakshi News home page

వైఎస్‌ఆర్ సీపీ అభ్యర్థుల నామినేషన్లు

Apr 10 2014 2:21 AM | Updated on Sep 2 2017 5:48 AM

జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజవకర్గాలకు వైఎస్‌ఆర్ సీపీ అభ్యర్థులు బుధవారం నామినేషన్ దాఖలు చేశారు.

జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజవకర్గాలకు వైఎస్‌ఆర్ సీపీ అభ్యర్థులు బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. వైరాలో బాణోత్ మదన్‌లాల్, అశ్వారావుపేటలో తాటి వెంకటేశ్వర్లు, పినపాకలో పాయం వెంకటేశ్వర్లు, కొత్తగూడెంలో వనమా వెంకటేశ్వరరావు, ఇల్లెందులో డాక్టర్ రవిబాబు నాయక్, సత్తుపల్లిలో డాక్టర్ మట్టా దయానంద్ నామినేషన్ వేశారు.

 కొత్తగూడెంలో వనమా...
 కొత్తగూడెం, న్యూస్‌లైన్: కొత్తగూడెం నియోజకవర్గ వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఆయన ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి, రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో డి.అమయ్‌కుమార్‌కు నామినేషన్ పత్రం ఇచ్చారు. డమ్మీ అభ్యర్థిగా వనమా సతీమణి వనమా పద్మావతి నామినేషన్ వేశారు. కార్యక్రమంలో సీపీఎం డివిజన్ కార్యదర్శి అన్నవరపు సత్యనారాయణ, ఐఎన్‌టీయూసీ నాయకులు జివి.భద్రం, న్యాయవాది పలివెల సాంబశివరావు పాల్గొన్నారు. వనమా పద్మావతి నామినేషన్ కార్యక్రమంలో సీపీఎం పట్టణ కార్యదర్శి భూక్యా రమేష్, నాయకులు కున్సోత్ ధర్మ తదితరులు పాల్గొన్నారు.

 వైరాలో మదన్‌లాల్...
 వైరా, న్యూస్‌లైన్: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వైరా అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా బాణోత్ మదన్‌లాల్ బుధవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి పోరిక మోహన్‌లాల్ స్వీకరించి, మదన్‌లాల్‌తో ప్రమాణం చేయించారు.
 
 భారీగా ర్యాలీ
 వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వైరా నియోజకవర్గ అభ్యర్థిగా బాణోత్ మదన్‌లాల్ బుధవారం నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా, స్థానిక శాంతినగర్ నుంచి పాత బస్టాండ్, క్రాస్ రోడ్, తల్లాడ రోడ్ మీదుగా తహశీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ సాగింది. వైరా, కొణిజర్ల, ఏన్కూరు, జూలూరుపాడు, కారేపల్లి మండలాల నుంచి పార్టీ శ్రేణులు, ప్రజలు, ప్రధానంగా పెద్ద సంఖ్యలో యువకులు, మహిళలు పాల్గొన్నారు. ర్యాలీ అగ్రభాగాన వాహనంలో పార్టీ పార్లమెంట్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వైరా అభ్యర్థి బాణోత్ మదన్‌లాల్.. ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఈ ర్యాలీలో వైఎస్‌ఆర్ సీపీ కళాజాతా క ళాకారులు ఆలపించిన గీతాలు, చేసిన నృత్యాలు, డప్పుల చప్పుడు ఆకట్టుకున్నాయి.

 అశ్వారావుపేటలో తాటి వెంకటేశ్వర్లు...
 అశ్వారావుపేట, న్యూస్‌లైన్: వైఎస్‌ఆర్ సీపీ అశ్వారావుపేట నియోజకవర్గ అభ్యర్థిగా తాటి వెంకటేశ్వర్లు బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఆయన మధ్యాహ్నం పార్టీ కార్యాల యం నుంచి ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లి పూజలు నిర్వహించారు. అనంతరం, ర్యాలీగా తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రం ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అశ్వారావుపేట నియోజకవర్గంలోని ఆరు మండలాల ముఖ్య నాయకులు జూపల్లి రమేష్‌బాబు, కొల్లి రవికిరణ్, జూపల్లి ఉపేందర్‌బాబు, బత్తుల అంజి, శ్రీనివాస్ గౌడ్, పుష్పాల చందర్‌రావు, రాయి రవీందర్, కొడగండ్ల వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement