4 కాన్వాయ్‌లు.. 45 బస్సులు | World Industrialists Conference arrangements in hyderabad | Sakshi
Sakshi News home page

4 కాన్వాయ్‌లు.. 45 బస్సులు

Nov 25 2017 3:08 AM | Updated on Aug 15 2018 2:32 PM

World Industrialists Conference arrangements in hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :  ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్‌)కు వేదికైన హెచ్‌ఐసీసీ నుంచి మంగళవారం రాత్రి భారత ప్రభుత్వ అధికారిక విందు జరగనున్న తాజ్‌ ఫలక్‌నుమా హోటల్‌కు ప్రముఖులు, అతిథుల్ని నాలుగు కాన్వాయ్‌లు, 45 బస్సుల్లో తరలించడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు నగర పోలీస్‌ ఇన్‌చార్జ్‌ కమిషనర్‌ వీవీ శ్రీనివాసరావు శుక్రవారం వెల్లడించారు.

జీఈఎస్‌ నేపథ్యంలో నగర పోలీసులు తీసుకుంటున్న చర్యలను బషీర్‌బాగ్‌ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మీడియాకు వెల్లడించారు. ఆ రోజు ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె ఇవాంకా ట్రంప్‌ ఒకే కాన్వాయ్‌లో ప్రయాణించే అవకాశం ఉందని, అయితే వారు ఒకే వాహనంలో వెళ్లరని తెలిపారు. ప్రముఖుల పర్యటన నేపథ్యంలో ఎక్కడా ప్రజలను ఇబ్బంది పెట్టట్లేదని ఆయన స్పష్టం చేశారు. ఇన్‌చార్జ్‌ కొత్వాల్‌ తెలిపిన వివరాలివీ..

అతిథుల తరలింపునకు పోలీసుల పక్కా వ్యూహం..
ప్రధాని మోదీ బేగంపేట విమానాశ్రయంలో, ఇవాంకా శంషాబాద్‌ విమానాశ్రయంలో దిగనున్నారు. మంగళవారం మధ్యాహ్నం నగరానికి వస్తున్న మోదీ బేగంపేట నుంచి హెలికాఫ్టర్‌లో మియాపూర్‌ వెళ్లి మెట్రో రైల్‌ను ప్రారంభిస్తారు. అనంతరం అక్కడ నుంచి హెచ్‌ఐసీసీకి వెళ్తారు. ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ని జీ+2 లెవల్‌లో ఉన్న ‘101’హాల్‌లో ఆ రోజు సాయంత్రం విందు జరుగనుంది. ప్రధాని, ఇవాంకాతో పాటు ఎంపిక చేసిన అతిథులు ఈ హాల్‌లో డిన్నర్‌ చేస్తారు. వీరితో పాటు హాజరయ్యే దాదాపు 2 వేల మంది అతిథులకు లాన్‌లో విందు ఏర్పాటు చేస్తున్నారు.

అయితే హెచ్‌ఐసీసీ నుంచి ఫలక్‌నుమాకు అతిథుల్ని తరలించడం పోలీసులకు సవాలే. దీనికోసం పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవ హరిస్తున్నారు. అతిథుల కోసం హెచ్‌ఐసీసీ నుంచి 45 బస్సుల్ని ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో ఎవరెవరు ఏ వాహనాలు ఎక్కాలి? ఎక్కడ దిగాలి? తదితర అంశాలతో ప్రణాళిక సిద్ధం చేశారు. వీటితో పాటు నాలుగు కాన్వాయ్‌లను గంటన్నర వ్యవధిలో, నాలుగు దఫాలుగా ఫలక్‌నుమాకు తరలించనున్నారు. అక్కడున్న దూద్‌ఖానా, బగ్గీఖానా, స్విమ్మింగ్‌పూల్స్‌లో పార్కింగ్‌ వసతి కల్పిస్తున్నారు. ఫలక్‌నుమాలో దాదాపు గంటన్నర పాటు ఉండనున్న మోదీ నేరుగా శంషాబాద్‌ చేరుకుని రాత్రి ఢిల్లీ తిరుగు పయనమవుతారు.

ఇక ఇవాంకా ఆమె బస చేసిన హోటల్‌కు చేరుకుంటారు. బుధవారం ఇవాంకా ఎక్కడెక్కడ పర్యటిస్తారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఆమె చార్మినార్‌ పర్యటనపైనా సందిగ్ధత ఉంది. బుధవారమే ఇవాంకా తిరిగి వెళ్లే ఆస్కారం ఉంది. అమెరికా అధికారులు తీసుకువస్తున్న మూడు ప్రత్యేక వాహనాలు ఇవాంకా వెంట ఉంటాయి. వాటిలోనే ఒకదాంట్లో ఆమె ప్రయాణిస్తారు.

గోల్కొండ రాణి లాన్స్‌లో..
చారిత్రక గోల్కొండ కోటలోని రాణి లాన్స్‌లో బుధవారం రాష్ట్ర ప్రభుత్వ అధికారిక విందు జరగనుంది. దీనికి మోదీ, ఇవాంకా మినహా మిగిలిన అతిథులు హాజరవుతారు. కోట ద్వారాలు చిన్నవి కావడంతో వీరు ప్రయాణించే బస్సులు నేరుగా లోపలకు వెళ్లే అవకాశం లేదు. దీంతో వీటిని ఆర్టిలరీ సెంటర్‌ వద్దే నిలిపేస్తారు. అక్కడి నుంచి ప్రత్యేక మినీ బస్సుల్లో అతిథుల్ని రాణి లాన్స్‌కు తీసుకువెళ్తారు. రెండు చోట్ల బఫెట్‌ నిర్వహిస్తున్నారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే రెండు ప్రాంతాల్లో ఉండే స్థానికులకు అవగాహన కల్పించారు. నిరంతరం తనిఖీలు, సోదాలతో 24/7 నిఘా ఉంచారు.

ఫలక్‌నుమాలో ఏఎస్‌ఎల్‌ నిర్వహణ..
అమెరికాకు చెందిన సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్లు, ప్రధాన భద్రతను పర్యవేక్షించే ఎస్పీజీ అధికారులు, రాష్ట్ర, కేంద్ర నిఘా వర్గాలతో పాటు భద్రతా ఏజెన్సీలు, సిటీ పోలీసులు శుక్రవారం మరోసారి సమావేశమయ్యారు. సిటీ పోలీసులు చేపడుతోన్న ఏర్పాట్లపై సీక్రెట్‌ సర్వీస్‌ సంతృప్తి వ్యక్తం చేసింది. శుక్రవారం ఫలక్‌నుమాలో ఉమ్మడి అడ్వాన్స్‌డ్‌ సెక్యూరిటీ లైజన్‌(ఏఎస్‌ఎల్‌) నిర్వహించారు. భద్రతా ఏర్పాట్లకు సంబంధించి సీక్రెట్‌ సర్వీస్‌ ఎలాంటి షరతులు విధించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement