ఆదివాసీలకు అండగా ఉంటాం | We will stand for adivasis | Sakshi
Sakshi News home page

Oct 7 2017 2:34 AM | Updated on Oct 7 2017 2:34 AM

We will stand for adivasis

కుమురం భీం సమాధి వద్ద నివాళులర్పిస్తున్న మంత్రి జోగు రామన్న, ప్రజాప్రతినిధులు

సాక్షి, ఆసిఫాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం ఆదివాసీలకు అండగా ఉంటుందని అటవీ, పర్యాటక, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. 2014 కంటే ముందు పోడు భూములను నమ్ముకుని వ్యవసాయం చేసుకునే గిరిజనులకు తప్పకుండా పట్టాలిస్తామని మంత్రి స్పష్టం చేశారు. శుక్రవారం కుమురం భీం జిల్లా కెరమెరి మండలం జోడేఘాట్‌లో జరిగిన కుమురం భీం 77వ వర్ధంతి కార్యక్రమానికి మంత్రి జోగు రామన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కుమురం భీం సమాధి వద్ద మంత్రి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్‌ సభలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధికి కట్టుబడి ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం ద్వారా గిరిజనులంతా అభివృద్ధి పథంలో పయనిస్తున్నారన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో భూముల పట్టాల విషయంలో అక్కడక్కడ సమస్యలు తలెత్తినట్లు తమ దృష్టికి వచ్చిందని వాటిని పరిష్కరిస్తామని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement