
మా ఖర్చింతే సార్..!
మన ఎమ్మెల్యేలు ఎన్నికల్లో చేసిన ఖర్చు రూ.10 లక్షలు కూడా దాటలేదు. అంతేనా అంటే ఇంతకంటే తక్కువే ఖర్చుచేశాం అనే సమాధానమొస్తుంది.
ఎన్నికల్లో రూ. పది లక్షలు కూడా ఖర్చుకాలేదని లెక్కచూపిన అభ్యర్థులు
సాక్షి, సిటీబ్యూరో: మన ఎమ్మెల్యేలు ఎన్నికల్లో చేసిన ఖర్చు రూ.10 లక్షలు కూడా దాటలేదు. అంతేనా అంటే ఇంతకంటే తక్కువే ఖర్చుచేశాం అనే సమాధానమొస్తుంది. ఎన్నికల కమిషనే రూ.28 లక్షల వరకు ఖర్చుచేసుకోవచ్చు అని వెసులుబాటిస్తే మన నాయకులు అంతకంటే తక్కువే ఖర్చుచేశామని అధికారులకు ఖర్చులు చూపించారు. అది ఎంతవరకు నిజమోకానీ నివేదిక మాత్రం అలాగే ఇచ్చారు.
నగరం నుంచి పలు అసెంబ్లీ స్థానాలకు పోటీచేసి గెలిచిన అభ్యర్థులు రూ. 28 లక్షలు కాదు కదా అందులో కనీసం సగం కూడా ఖర్చు చేయలేదు. అంతెందుకు పది లక్షలు కూడా ఖర్చు చేయని వారు చాలా మందే ఉన్నారు. కేవలం రూ. 3.61 లక్షలతోనే గెలిచిన వారు కూడా ఉన్నారు. జిల్లా ఎన్నికల అధికారికి వారు సమర్పించిన ఎన్నికల ఖర్చులో అంతే చూ పారు మరి. అలా తక్కువ ఖర్చుతో గెలిచిన వారిలో అంబర్పేట నియోజకవర్గం నుంచి జి.కిషన్రెడ్డి(రూ.3,61,482), కంటోన్మెంట్ నుంచి జి.సాయన్న( రూ. 5,37,614) ఉన్నారు.
హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎక్కువ ఖర్చు చేసిన వారిలో గోషామహల్ నుంచి గెలిచిన రాజాసింగ్ రూ. 13,05,956 ఖర్చు చూపగా, ఆ తర్వాతి స్థానంలో సికింద్రాబాద్ నుంచి పోటీ చేసిన టి.పద్మారావు రూ. 11,99,430 ఖర్చు చేసినట్లు చూపారు. జిల్లా పరిధిలో ఆయా నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన వారిలో గెలిచిన వారు.. రెండో స్థానంలో నిలిచిన వారు ఎన్నికల అధికారికి పంపిన సమాచారం మేరకు వారు చేసిన ఖర్చు వివరాలిలా ఉన్నాయి.