కుట్ర లేదు.. కుతంత్రం లేదు!

This was done for the SIM card's target - Sakshi

సిమ్‌కార్డుల టార్గెట్‌ కోసమే ఈ పని చేశా

‘నకిలీ వేలిముద్రల’ సంతోష్‌ వెల్లడి

కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు

సాక్షి, హైదరాబాద్‌: ‘కుట్ర లేదు.. కుతంత్రం లేదు.. సిమ్‌కార్డుల టార్గెట్‌ పూర్తి చేసుకో వడానికే నకిలీ వేలి ముద్రలు సృష్టించా. అలా యాక్టివేట్‌ చేసిన సిమ్‌కార్డుల్ని ధ్వంసం చేశా. ఇందులో మావోయిస్టులు, ఉగ్రవాదుల ప్రమే యమో లేదు. సెల్‌ఫోన్‌లో ఫోర్‌జీ సిమ్‌కార్డు ఉంది. దీంతో కంప్యూటర్‌తో పని లేకుండా సెర్చ్‌లు చేశా’ అని పాత సంతోష్‌కుమార్‌ పోలీసు, నిఘా వర్గాల దగ్గర ఏకరువు పెట్టాడు. ఇంటర్నెట్, యూట్యూబ్‌లో చూసి ఈ పని చేశానని, ఇంత పెద్ద నేరమనే విషయం కూడా తెలియదని చెప్పాడు. గత వారం అరెస్టు చేసిన సంతోష్‌ను ఎస్సార్‌నగర్‌ పోలీసులు విచారణ కోసం కోర్టు అనుమతితో గురువారం కస్టడీలోకి తీసుకున్నారు.  

ఈ వ్యవహారంలో అసాంఘిక శక్తుల కోణానికి సంబం ధించి పోలీసులు సంతోష్‌ను వివిధ కోణా ల్లో ప్రశ్నిస్తున్నారు. అయితే, రూ.51 టాక్‌టైమ్‌తో కూడిన సిమ్‌కార్డుల్ని ఉచితంగా ఇద్దామన్నా సాధ్యం కాలేదని, అందుకే నెలకు 600 సిమ్‌కార్డుల యాక్టివేషన్‌ టార్గెట్‌ పూర్తి చేయడానికి ప్రత్యా మ్నాయ మార్గాలు వెతికానన్నాడు. సిమ్‌కార్డు పొందాలంటే ఆధార్‌ వివరాలు, వేలిముద్ర తప్పనిసరి కావడంతో ఇబ్బందులు ఎదుర య్యాయని, కొత్త మార్గదర్శకాల ప్రకారం ఒక సర్వీస్‌ ప్రొవైడర్‌ నుంచి ఓ వ్యక్తి పేరుతో గరి ష్టంగా 9 సిమ్‌కార్డులే జారీ అయ్యేలా నిబం ధనలు అమల్లోకి రావడంతో పరిస్థితి మరింత దిగజారిందన్నాడు. టార్గెట్‌ పూర్తి చేయడం కోసం అనేక మార్గాలు అన్వేషించానన్నాడు. స్థిరాస్తుల క్రయ విక్రయాల సమయంలో పూర్తి పేరు, చిరు నామా, ఆధార్‌ నంబర్‌తోపాటు వేలిముద్రలు డాక్యుమెంట్‌లో పొందుపరు స్తారని గుర్తించానని చెప్పాడు. 

దాదాపు 8 నెలలుగా..
దాదాపు 8 నెలలుగా రాష్ట్ర రిజిస్ట్రేషన్‌ శాఖ వెబ్‌సైట్‌ నుంచి డాక్యుమెంట్లు డౌన్‌లోడ్‌ చేయడం ప్రారంభించానని సంతోష్‌కుమార్‌ అధికారులకు వెల్లడించాడు. పాలిమర్‌ ఆధారిత రబ్బర్‌ స్టాంపుల తయారీ యంత్రాన్ని ఇండి యా మార్ట్‌ వెబ్‌సైట్‌ నుంచి రూ.16 వేలకు ఖరీదు చేసి నకిలీ వేలిముద్రలు సృష్టించానని వివరించాడు. 3 వేలకు పైగా వేలిముద్రలు తయారు చేసి, 6 వేల సిమ్‌కార్డులు యాక్టివేట్‌ చేసినట్లు అంగీకరించాడు. యాక్టివేటైన కార్డుల ను, పని పూర్తయిన వేలిముద్రల్ని ధ్వంసం చేశానని, కొన్నింటిని టాక్‌టైమ్‌ పూర్తయ్యే వర కు వాడి పడేశానన్నాడు. అంతేతప్ప ఎలాంటి హ్యాకింగ్‌కు పాల్పడలేదని, ఆధార్‌ సహా ఏ వెబ్‌సైట్‌లోకి అక్రమంగా చొరబడలేదని సంతోష్‌కుమార్‌ వివరించాడు. తొలిరోజు విచారణ హైదరాబాద్‌లో పూర్తి చేసిన అధికారులు శుక్రవారం సంతోష్‌ స్వస్థలం పెద్దపల్లి జిల్లా ధర్మారం తీసుకువెళ్లాలని నిర్ణయించారు. అక్కడ అతనికి చెందిన ధనలక్ష్మీ కమ్యూనికేషన్‌లో సోదాలు చేయనున్నారు. ఇప్పటికే రబ్బర్‌ స్టాంపుల తయారీ యంత్రంతో పాటు అతడి సెల్‌ఫోన్, డౌన్‌లోడ్‌ చేసిన 1,400 డాక్యుమెంట్లు, నకిలీ వేలిముద్రల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top