మాంగళ్యం తంతు'నో'నేనా? | Wedding registration slots not open for three days due to server upgrade | Sakshi
Sakshi News home page

మాంగళ్యం తంతు'నో'నేనా?

Jul 2 2026 6:04 AM | Updated on Jul 2 2026 6:04 AM

Wedding registration slots not open for three days due to server upgrade

సర్వర్‌ అప్‌గ్రెడేషన్‌తో మూడ్రోజులుగా ఓపెన్‌ కాని వివాహ రిజిస్ట్రేషన్ల స్లాట్లు 

రోజూ 200 వివాహ రిజిస్ట్రేషన్లు జరగాల్సి ఉండగా.. 47 దరఖాస్తులే వచ్చిన వైనం  

ఇంకా సమస్యల వలయంలోనే భూభారతి పోర్టల్‌  

సాక్షి, హైదరాబాద్‌: స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సర్వర్‌ అప్‌గ్రెడేషన్‌ ప్రక్రియ వివాహ రిజిస్ట్రేషన్లకు తిప్పలు తెచ్చి పెట్టింది. ఈ అప్‌గ్రెడేషన్‌ కారణంగా ఏర్పడిన సాంకేతిక సమస్యలతో మూడ్రోజులుగా వివాహ రిజిస్ట్రేషన్ల పోర్టల్‌ సరిగా ఓపెన్‌ కావడం లేదు. సోమ, మంగళవారాల్లో అన్ని రకాల రిజిస్ట్రేషన్‌ సేవలకూ అంతరాయం కలిగినప్పటికీ బుధవారం నాటికి వ్యవస్థ గాడిలో పడింది. అయినా వివాహ రిజిస్ట్రేషన్ల సేవలు మాత్రం సాంకేతిక సమస్యలనే ఎదుర్కొన్నాయి. దీంతో ప్రతి రోజూ సగటున 200 వరకు రిజిస్ట్రేషన్లు జరగాల్సి ఉండగా, బుధవారం కేవలం 47 దరఖాస్తులు మాత్రమే వచ్చాయని రిజిస్ట్రేషన్ల శాఖ గణాంకాలు చెబుతున్నాయి. సాంకేతిక సమస్యలను పరిష్కరిస్తున్నామని, గురువారం నుంచి అన్ని రకాల రిజిస్ట్రేషన్‌ సేవలు అందుబాటులోకి తెస్తామని అధికారులు చెబుతున్నారు.  

క్రమక్రమంగా.. 
సర్వర్‌ అప్‌గ్రెడేషన్‌ కారణంగా సాంకేతిక సమస్యలతో మూడ్రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల వ్యవస్థ ఇబ్బందులు పడుతుండగా, బుధవారం నాటికి ఓ కొలిక్కి వచ్చింది. ఎప్పటికప్పుడు ఎదురయ్యే సాంకేతిక సమస్యలను అధికారులు పరిష్కరిస్తుండటంతో రిజిస్ట్రేషన్లకు స్లాట్‌ బుకింగ్‌తో పాటు సబ్‌రిజిస్ట్రార్ల లాగిన్‌లో రిజిస్ట్రేషన్‌ లావాదేవీల నిర్వహణ సజావుగా సాగింది. ఈసీలు, ఇతర సేవలు కూడా అందుబాటులోకి వచ్చాయి. దీంతో బుధవారం ఒక్క రోజే రాష్ట్రవ్యాప్తంగా 4,300కు పైగా లావాదేవీలు పూర్తయ్యాయి. కానీ వ్యవసాయ భూములను రిజిస్ట్రేషన్‌ చేసే భూభారతి పోర్టల్‌ మాత్రం సాంకేతిక సమస్యల వలయంలోనే చిక్కుకుని పోయింది. వరుసగా మూడో రోజు బుధవారం కూడా తహసీల్దార్ల లాగిన్‌లో సాంకేతిక సమస్యలొచ్చాయి. 

లాగిన్‌ అవుతున్నా వెంటనే లాగ్‌ అవుట్‌ కూడా అయిపోతుండటంతో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ నిర్వహించడం కష్టతరమైందని రెవెన్యూ వర్గాలంటున్నాయి. రెవెన్యూ వర్గాల గణాంకాల ప్రకారం భూభారతి పోర్టల్‌ ద్వారా బుధవారం 1,840 దరఖాస్తులు రాగా, కేవలం 159 మాత్రమే పూర్తయ్యాయి. సాంకేతిక సమస్యలతో పది నిమిషాలకోసారి అంతరాయం ఏర్పడుతున్నందున లావాదేవీ పూర్తికావడం లేదని తహసీల్దార్లు చెబుతున్నారు. గత నెల 25వ తేదీ నుంచి భూభారతి గణాంకాలను పరిశీలిస్తే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల కోసం 11,700కు పైగా దరఖాస్తులు రాగా, అందులో కేవలం 3,700 వరకు మాత్రమే లావాదేవీలు పూర్తయ్యాయి. ఇందులో విరాసత్‌ల కోసం 1,200కు పైగా దరఖాస్తులు రాగా, కేవలం రెండంటే రెండు లావాదేవీలు మాత్రమే పూర్తి కావడం గమనార్హం.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement