ఆడుకునేందుకు వెళ్తున్నామంటూ బయలుదేరిన చిన్నారులు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ సంఘటన పటాన్చెరు మండలం అమీన్పూర్ గ్రామంలోని పెద్ద చెరువు వద్ద సోమవారం వెలుగు చూసింది.
రామచంద్రాపురం (మెదక్) : ఆడుకునేందుకు వెళ్తున్నామంటూ బయలుదేరిన చిన్నారులు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ సంఘటన పటాన్చెరు మండలం అమీన్పూర్ గ్రామంలోని పెద్ద చెరువు వద్ద సోమవారం వెలుగు చూసింది. పోలీసులు, మృతుల కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా నందిపల్లికి చెందిన కృష్ణమూర్తి జీవనోపాధి కోసం ఎనిమిదేళ్ల క్రితం పటాన్చెరు మండలం అమీన్పూర్కు వలస వచ్చారు. అమీన్పూర్ శివారులోని కోకాకోలా పరిశ్రమలో కార్మికుడిగా పని చేస్తున్నాడు.
కాగా అతని కుమారుడు మురళి (9) స్థానిక షైన్ లిటిల్ హైస్కూల్లో రెండో తరగతి చదువుతున్నాడు. ఇంటి పక్కనే నివాసముండే మధ్యప్రదేశ్కు చెందిన మన్సూర్లాల్ వర్మ కుమారుడు రాజీవ్వర్మ (10) స్థానిక షైన్ లిటిల్ హైస్కూల్లోనే మూడో తరగతి చదువుతున్నాడు. ఈ రెండు కుటుంబాలు పక్క పక్కనే ఉండటంతో మురళి, రాజీవ్ వర్మ కలసి ఆడుకునేవారు. ఆదివారం సాయంత్రం ఇద్దరూ ఆడుకుంటూ సమీపంలోని పెద్దచెరువు వద్దకు వెళ్లారు. ఈత కొట్టేందుకు అందులో దిగి, మునిగిపోయారు. రాత్రయినా చిన్నారులు ఇళ్లకు చేరుకోకపోయేసరికి కుటుంబసభ్యులు వెదుకులాట ప్రారంభించారు. సోమవారం ఉదయం చెరువులో బాలుర మృతదేహాలు లభించాయి.