పాత్రికేయం ముసుగులో సంఘవిద్రోహక చర్యలకు పాల్పడుతున్న వారిని పోలీసులు అరెస్టు చేశారు.
వరంగల్ క్రైం: పాత్రికేయం ముసుగులో సంఘవిద్రోహక చర్యలకు పాల్పడుతున్న వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన వరంగల్ పరిధిలో శుక్రవారం జరిగింది. వివరాలు.. ఖమ్మం జిల్లా భద్రాచలం సమీపంలోని కొత్తపేట కాలనీకి చెందిన కందుల పవన్కుమార్ రెడ్డి, అదే గ్రామానికి చెందిన పెద్దినేని రవిప్రసాద్.. 'భద్రాద్రి' అనే వారపత్రికలో పాత్రికేయులుగా పనిచేస్తున్నారు. గత కొంతకాలంగా డబ్బు సంపాదించాలనే దురాశతో వీరు తప్పుడు మార్గాలను అన్వేషిస్తూ.. దొంగనోట్లు ముద్రించాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడువుగా ప్రింటర్ సిద్ధంచేసుకొని రూ.43 లక్షలు విలువ చేసే దొంగనోట్లు ముద్రించారు.
వీటిని మార్పిడి చేయడానికి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్కు చెందిన దిడిగం మనోజ్కుమార్ అనే ఇంజనీరింగ్ విద్యార్థితో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ రోజు ఉదయం రూ.లక్ష నగదు ఇచ్చి పదహారు లక్షల దొంగనోట్లు తీసుకునేందుకు బీటెక్ విద్యార్థిని స్థానికంగా ఉన్న ఒక పెట్రోల్బంక్ వద్దకు రావాల్సిందిగా కోరారు. ఈ విషయం తెలుసుకున్న వరంగల్ సీసీఎస్ పోలీసులు పథకం ప్రకారం వారిని పట్టుకున్నట్టు సమాచారం.