ఆర్టీసీని మూసివేసేందుకు కుట్ర జరుగుతోంది.. | TSRTC Union Leader Ashwathama Reddy Slams Telangana Government | Sakshi
Sakshi News home page

ఆర్టీసీని మూసివేసేందుకు కుట్ర జరుగుతోంది..

Oct 6 2019 1:47 PM | Updated on Oct 6 2019 7:54 PM

TSRTC Union Leader Ashwathama Reddy Slams Telangana Government - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు అన్ని సంఘాలు మద్దతు ఇస్తున్నాయని ఆర్టీసీ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ అధ్యక్షుడు అశ్వత్ధామరెడ్డి తెలిపారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని ఏఐటీయూసీ కార్యాలయంలో ఆదివారం జరిగిన ట్రేడ్‌ యూనియన్‌ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ..‘ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఆర్టీసీని సమ్మెలోకి నెట్టింది. ఆర్టీసీ ఆస్తులను కొల్లగొట్టే ప్రయత్నం జరుగుతోంది. ప్రభుత్వ చర్యల వల్లే సమ్మెకు వెళ్లేలా చేశాయి. విమానాలపై ఉన్న ప్రేమ ఆర్టీసీపై లేదా?. ఆర్టీసీని మూసివేందుకు ప్రభుత్వం కుట్రపూరితంగా యత్నిస్తోంది. 

ఆర్టీసీ సమ్మెకు సంఘీభావం తెలిపిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. జీతభత్యాల గురించి మా పోరాటం కాదు. రవాణా వ్యవస్థను చిన్నాభిన్నం కాకుండా చూడటమే మా థ్యేయం. ఆర్టీసీ కార్మికులు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొన్నారు. అన్ని రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాలు ఆర్టీసీ సమ్మెకు మద్దతు ఇస్తున్నాయి. ఇది ఆరంభం మాత్రమే, పోరాటం ఇంకా కొనసాగుతోంది. ఇంత దుర్భరమైన పరిస్థితి ఆర్టీసీ ఎప్పుడూ రాలేదు. అన్ని పార్టీలు ఉద్యోగ సంఘాలు ఆర్టీసీ ఉద్యమానికి మద్దతు ఇస్తున్నాయి. ఆర్టీసీ ఇమేజ్‌ పోగొట్టాలని కేసీఆర్‌ కుట్ర పన్నారు. దసరా ముందు బలవంతంగా సమ్మెకు వెళ్లేలా చేసారు. 

రేపటి ఆర్టీసీ కార్మికుల ధర్నాకు అందరూ మద్ధతు తెలపాలి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. మంత్రుల కమిటీ వేసినా సమస్య పరిష్కారం కాలేదు. మంత్రి పువ్వాడ అజయ్‌ ఏనాడైనా ఉద‍్యమంలో పాల్గొన్నారా?. గతంలోనే కేసీఆర్‌ వైఖరిని ఇదే పువ్వాడ అజయ్‌ తప్పుపట్టలేదా. మా సమస్యలు ఏనాడు ముఖ్యమంత్రి వద్ద పరిష్కారం కాలేదు. ఆర్టీసీతో నాకు సంబంధం లేదన్న మంత్రి...అర్థరాత్రి ప్రెస్‌మీట్‌ పెట్టి ఉద్యోగులను తీసేస్తా అని ఎలా ప్రకటించారు. మీలా ముఖ్యమంత్రి తీసేస్తే పోయే ఉద్యోగం కాదు మాది’ అని ఘాటు వ్యాఖ‍్యలు చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement