అప్పుడు.. ఇప్పుడు..! | trs first in municipal chairman, vice-chairman elections | Sakshi
Sakshi News home page

అప్పుడు.. ఇప్పుడు..!

Jul 4 2014 1:29 AM | Updated on Mar 18 2019 7:55 PM

పురపాలక అధ ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాల పోరులో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల సత్తా తేలింది.

సాక్షి, మంచిర్యాల : పురపాలక అధ ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాల పోరులో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల సత్తా తేలింది. అధికార  పార్టీ అయిన టీఆర్‌ఎస్ ఎత్తుగడలు, కొందరు కౌన్సిలర్ల భవిష్యత్తు ఆలోచనతో టీడీపీ, కాంగ్రెస్‌లు చతికిలపడ్డాయి. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో ఏ ఒక్క స్థానంలోనూ ఆ పార్టీలకు చెందిన కౌన్సిలర్లు చైర్‌పర్సన్ సహా వైస్ చైర్మన్ స్థానాన్ని దక్కించుకోకపోవడం పరిస్థితికి అద్దం పడుతోంది. మంచిర్యాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థి వైస్ చైర్‌పర్సన్ అయినప్పటికీ అది కేవలం సాంకేతికమే.

జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో అధ్యక్ష స్థానాల కైవసం చేసుకున్న పార్టీలు, గత పాలకమండలి ఏ పార్టీ ఆధ్వర్యంలో కొనసాగిందనే వివరాలు..

భైంసా మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌తోపాటు వైస్ చైర్‌పర్సన్ పీఠాన్ని ఎంఐఎం కైవ సం చేసుకుంది. కాంగ్రెస్‌కు కేవలం రెండు స్థానాలు దక్కగా టీడీపీ ఖాతాయే తెరవలేదు. ఈ మున్సిపాలిటీ గత చైర్‌పర్సన్ టీడీపీకి చెందినవారే కావడం గమనార్హం. వైస్ చైర్‌పర్సన్‌గా స్వతంత్ర అభ్యర్థి పీఠాన్ని అలంకరించారు.

నిర్మల్ పురపాలక చైర్‌పర్సన్ స్థానాన్ని బీఎస్పీ, వైస్ చైర్‌పర్సన్ స్థానాన్ని ఎంఐఎం దక్కించుకున్నాయి. ఈ మున్సిపాలిటీలో కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్న వారిలో ఐదుగురు విజయం సాధించగా టీడీపీ తరఫున ఒక్క కౌన్సిలర్  గెలవకపోవడం గమనార్హం. ఈ మున్సిపాలిటీ తాజా మాజీ పాలకవర్గంలో కాంగ్రెస్‌కు చెందిన కౌన్సిలర్లే అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలను అలంకరించారు.

ఆదిలాబాద్ మున్సిపాలిటీ చైర్‌పర్సన్ పీఠాన్ని టీఆర్‌ఎస్, వైస్ చైర్‌పర్సన్ స్థానాన్ని ఎంఐఎం దక్కించుకుంది. కాంగ్రెస్ తరఫున ఏడుగురు కౌన్సిలర్లు విజయం సాధించగా టీడీపీ నుంచి బరిలో దిగిన వారు ఒక్కరూ గెలవలేదు. గత చైర్‌పర్సన్ కాంగ్రెస్‌కు చెందిన వారు కాగా వైస్ చైర్‌పర్సన్ ఎంఐఎం కౌన్సిలర్.

మంచిర్యాల పురపాలక అధ్యక్షస్థానాన్ని టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంది. 18 మంది కౌన్సిలర్లను గెలుచుకున్న హస్తం పార్టీకి ఆరుగురు కౌన్సిలర్లు ఝలక్ ఇవ్వడంతో ఆ పార్టీ బరిలో నిలవలేదు. తెలుగుదేశం తరఫున ఈ మున్సిపాలిటీలో ఒక్క కౌన్సిలర్‌ను నెగ్గకపోవడం ఆ పార్టీ స్థితికి అద్దం పడుతోంది. ఈ మున్సిపాలిటీ తాజా మాజీ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్‌లు కాంగ్రెస్‌కు చెందిన వారే .

బెల్లంపల్లి మున్సిపాలిటీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలు రెండింటినీ టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంది. కాంగ్రెస్‌కు తరఫున 14 మంది, టీడీపీ తరఫున ఐదుగురు కౌన్సిలర్లు విజయం సాధించారు. కాంగ్రెస్, టీడీపీ కౌన్సిలర్లు గెలిచిన పార్టీని కాదని టీఆర్‌ఎస్ కౌన్సిలర్‌కు మద్దతివ్వడం వల్లే గులాబీ పార్టీ పుర పీఠాలను దక్కించుకోగలిగింది. గతంలో చైర్‌పర్సన్‌గా కాంగ్రెస్, ైవె స్ చైర్‌పర్సన్‌గా టీఆర్‌ఎస్‌కు చెందిన కౌన్సిలర్లు పీఠాన్ని అలంకరించారు.

కాగజ్‌నగర్ మున్సిపాలిటీ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ స్థానాన్ని టీఆర్‌ఎస్ ద క్కించుకుంది. కాంగ్రెస్ తరఫున నలుగురు కౌన్సిలర్లు గెలవగా, టీడీపీ నుంచి ఒక్కరూ విజయం సాధించలేదు. గత  పాలకవర్గంలో చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్  పీఠాలను కాంగ్రెస్ దక్కించుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement