పాత నోట్లతో బిల్లులు కట్టొచ్చు
పాత రూ.1,000, రూ.500 నోట్లను వినియోగించుకునేందుకు కేంద్రం మరో అవకాశం కల్పిం చిందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
సాక్షి, హైదరాబాద్: పాత రూ.1,000, రూ.500 నోట్లను వినియోగించుకునేందుకు కేంద్రం మరో అవకాశం కల్పిం చిందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. గ్రామ పంచాయతీ, మున్సిపాల్టీల్లో చెల్లించాల్సిన ఇంటి, ఆస్తి పన్నులు, నల్లా, కరెంటు బిల్లులు, పాత బకాయిలు, ఇతర పన్నులు, ఫీజులు ఏవైనా శుక్రవారం అర్ధరాత్రి వరకు చెల్లించవచ్చని గురువారం రాత్రి వివరించారు. జీహెచ్ఎంసీ పరిధిలో అదనపు కౌంటర్లు ఏర్పాటు చేస్తామని, కార్యాలయాలు అదనపు సమయాలు పని చేస్తాయని తెలిపారు. ‘ఈ (గురువారం) ఉదయం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలిసిన సందర్భంలో రూ.500, రూ.1000 నోట్ల మార్పిడిపై ప్రజల స్పందనేమిటని నన్నడిగారు.
మంచి నిర్ణయమేనని, అయితే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ డిస్కమ్లు భారీ నష్టాల్లో ఉన్నాయని, వాటిని చెల్లించేందుకు ప్రజలకు వెసులుబాటు కల్పించాలని కోరాం. ఆయన సానుకూలంగా స్పందించారు. రద్దయిన నోట్లతో బిల్లులు కట్టొచ్చంటూ గెజిట్ విడుదల చేశారు’ అని వివరించారు. ‘రాష్ట్రంలోని మున్సిపల్, పంచయతీ అధికారులను ఇప్పటికే అప్రమత్తం చేశాం. జీహెచ్ఎంసీ, హెచ్ఎండబ్ల్యూఎస్ పరిధిలో శుక్రవారం అన్ని కార్యక్రమాలనూ సస్పెండ్ చేశాం. మీ-సేవా, ఈ-సేవా కేంద్రాలు అందుబాటులో ఉంటారుు. చెల్లింపులకు రసీదు ఇస్తాం. ఈ పన్నుల రూ పేణా ప్రజలు చెల్లించే మొత్తం ఆదాయపు పన్ను పరిధిలోకి రాదు’ అని స్పష్టం చేశారు. వాట్సాప్లో వెల్లువెత్తుతున్న వదంతులను నమ్మొద్దని సూచించారు.