విద్యార్థుల భవిష్యత్తు కోసమే... | Thummala Papireddy Speaks About SET Entrance Exam In Telangana | Sakshi
Sakshi News home page

విద్యార్థుల భవిష్యత్తు కోసమే...

Jun 28 2020 3:45 AM | Updated on Jun 28 2020 3:45 AM

Thummala Papireddy Speaks About SET Entrance Exam In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘ప్రస్తుత పరిస్థితుల్లో రిస్క్‌ అయినా పకడ్బందీ ఏర్పాట్ల మధ్య ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్‌) నిర్వహణకు చర్యలు చేపట్టాం. జూలై 1 నుంచి సెట్స్‌ ప్రారంభమవుతాయి. విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించే వాటి నిర్వహణకు పక్కాగా చర్యలు చేపడుతున్నాం’అని ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ తుమ్మల పాపిరెడ్డి చెప్పారు. ‘ఇప్పుడు సెట్స్‌ నిర్వహించకపోతే ప్రవేశాలపై తీవ్ర ప్రభావం ఉంటుంది. దాంతో పిల్లలు ఒక విద్యా సంవత్సరం నష్టపోయే ప్రమాదం ఏర్పడవచ్చు. ఈ నష్టాన్ని ఆపలేకపోయామనే బాధ మమ్మల్ని వెంటాడకూడదు. అందుకే ధైర్యంగా ముందడుగు వేస్తున్నాం. ఒక్కో విద్యార్థి మూడు గంటల పాటు హాజరయ్యే పరీక్షల నిర్వహణకు అన్ని రకాల జాగ్రత్తలతో ముందుకు సాగుతున్నాం’అని వివరించారు. రాష్ట్రంలో నిర్వహించనున్న ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు 4,68,271 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఆయా పరీక్షల ఏర్పాట్లపై పాపిరెడ్డి ‘సాక్షి’తో చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే..

అడుగడుగునా శానిటైజేషన్‌.. 
సెట్స్‌కు హాజరయ్యే విద్యార్థులు మాస్క్‌లు, గ్లౌజులు ధరించడం తప్పనిసరి. పరీక్ష కేంద్రాల్లో అడుగడుగునా శానిటైజ్‌ చేస్తాం. గేట్‌ దగ్గరి నుంచి మొదలు.. ల్యాబ్స్, బాత్రూమ్‌లు ప్రతిచోటా శానిటైజర్లను ఉంచుతాం. ఆయా చోట్ల సిబ్బందిని నియమించి శానిటైజర్‌ వేసేలా ఏర్పాట్లు చేస్తున్నాం. లేదా విద్యార్థులు సొంతంగా శానిటైజర్‌ బాటిల్స్, చిన్న వాటర్‌ బాటిల్‌ వెంట తెచ్చుకోవచ్చు.

పరీక్ష హాల్‌ ఎక్కడో బోర్డులు, పోస్టర్ల ద్వారా ప్రదర్శన 
పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల వెంట తల్లిదండ్రుల్లో ఒక్కరే రావాలి. వారిని కూడా సెంటర్‌కు 200మీ. నుంచి 300 మీటర్ల దూరంలోనే ఆపేస్తాం. ఏ హాల్‌టికెట్‌ నంబరు నుంచి ఏ నంబరు వరకు ఏ రూమ్‌లో పరీక్ష రాయాలో బోర్డులను ఏర్పాటు చేస్తాం. పరీక్ష కేంద్రం బయటా ఇవి ఉంటాయి. విద్యార్థులు ఎవరి దగ్గరికి వెళ్లక్కర్లేకుండా, ఎవరిని అడగక్కర్లేకుండా ఈ చర్యలు చేపడుతున్నాం.

ప్రతీ సెషన్‌కు మధ్య 3 గంటల వ్యవధి 
పరీక్ష హాల్లోనూ పక్కాగా శానిటైజేషన్‌ చేస్తాం. భౌతికదూరం పాటించేలా చూస్తాం. ఆన్‌లైన్‌ పరీక్షలు కాబట్టి ప్రతి ఇద్దరు విద్యార్థుల మధ్య దూరం ఎక్కువగా ఉండేలా చూస్తాం. విద్యార్థి ముందు భాగంలో కంప్యూటర్‌ స్క్రీన్‌ ఉంటుంది. దాని వెనుక చెక్క బోర్డు అడ్డుగా ఉంటుంది. ల్యాబ్‌లో క్యాబిన్‌ తరహాలోనే ఉంటుంది. పరీక్ష పూర్తయ్యాక కూడా ఆ కేంద్రంలోని ఏ ల్యాబ్‌ విద్యార్థుల తరువాత ఏ ల్యాబ్‌ వారు వెళ్లాలనేది నిర్ణయిస్తాం. వాటికి నంబరింగ్‌ ఇస్తాం. అంతా ఒకేసారి బయటకు వెళ్లకుండా, ఒకరి దగ్గరకు ఒకరు వెళ్లకుండా చూస్తాం. బయటకు వెళ్లాక కూడా తల్లిదండ్రులు తమ పిల్లలను ఇతర పిల్లలతో కలవకుండా వెంటనే తీసుకెళ్లాలి. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలుంటాయి. ఒక సెషన్‌ పరీక్ష పూర్తయ్యాక కంప్యూటర్, కీబోర్డు, మౌస్, టేబుల్, చైర్‌తోపాటు ఆ హాల్‌ అంతా, కింద ఫ్లోర్‌తో సహా శానిటైజ్‌ చేస్తాం. ఆ తరువాత మధ్యాహ్నం పరీక్షకు సిద్ధం చేస్తాం. ఉదయం సెషన్‌కు మధ్యాహ్నం సెషన్‌కు మధ్య మూడు గంటల వ్యవధి ఉంటుంది.

విద్యార్థుల మేలు కోరే.. 
సెట్స్‌ నిర్వహణ ఇప్పుడు చేపట్టకపోతే ఎప్పుడు నిర్వహించాల్సి వస్తుందో తెలియదు. విద్యార్థులకేమో త్వరగా పరీక్ష పూర్తి కావాలని ఉంది. మేలో జరగాల్సిన పరీక్ష వాయిదా పడి నెలన్నర దాటిపోయింది. ఇంకా ఎన్ని రోజులు ప్రిపేర్‌ కావాలనే ఆందోళన వారిలో ఉంది. ఇప్పుడు నిర్వహించకుండా వాయిదా వేస్తే మళ్లీ అక్టోబరుకు వెళ్లాల్సి రావచ్చు. దానివల్ల విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతారు. అప్పుడు నిర్వహణ సాధ్యమవుతుందో లేదో తెలియదు. అందుకే విద్యార్థుల కోసం సెట్స్‌ నిర్వహించక తప్పడం లేదు.

వీలైనంత మందికి సెంటర్ల మార్పు 
ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులు పలువురు లాక్‌డౌన్‌కు ముందు ఎంసెట్, ఇతర సెట్స్‌కు దరఖాస్తు చేశారు. అపుడు హైదరాబాద్‌లో పరీక్ష రాసేలా సెంటర్‌ను ఎంచుకున్నారు. తరువాత లాక్‌డౌన్‌ కొనసాగడంతో ఏపీకి వెళ్లిపోయారు. ఇప్పుడు వారు ఏపీలో తమ ప్రాంతాల్లో పరీక్షలు రాస్తామని, తెలంగాణకు రాలేమని, బస్సులు నడవడం లేదని అంటున్నారు. వారు కోరుకున్నట్లుగా పరీక్ష కేంద్రాలను మార్పు చేశాం. తెలంగాణలోనూ మార్పులు చేశాం. కాలేజీ హాస్టళ్లలో ఉన్న వారు మొదట్లో హైదరాబాద్‌ కేంద్రం పెట్టుకున్నారు. తరువాత జిల్లాలకు మార్చుకున్నారు. ఇలా పరీక్ష కేంద్రాలను దాదాపు 20 వేల మందికి మార్చాం. వీలైనంత వరకు, విద్యార్థులకు సమీపంలోనే పరీక్ష కేంద్రాలను కేటాయించాం. కంప్యూటర్లు, ఇంటర్నెట్‌ సదుపాయం లేకపోతే ఇతర ప్రాంతాల్లో కేంద్రాలను వేశాం. విద్యార్థులు ఆందోళన చెందకుండా, తగిన జాగ్రత్తలు, భౌతికదూరం పాటిస్తూ పరీక్షలకు హాజరు కావాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement