ఇక పట్టాభూముల్లో ఇసుక తవ్వకాలు | The degree sand mined lands | Sakshi
Sakshi News home page

ఇక పట్టాభూముల్లో ఇసుక తవ్వకాలు

Jun 20 2015 2:57 AM | Updated on Mar 28 2018 11:08 AM

తాండూరు: తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎండీసీ) ఆధ్వర్యంలో పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలు, అమ్మకాలు జరుగనున్నాయి.

తాండూరు: తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎండీసీ) ఆధ్వర్యంలో పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలు, అమ్మకాలు జరుగనున్నాయి. జీఓ 30 ప్రకారం రాష్ట్రంలోని పది జిల్లాల్లో మొదటగా నిజామాబాద్ జిల్లాలో ఒప్పందం చేసుకున్న టీఎస్‌ఎండీసీ రెండో ఒప్పందం రంగారెడ్డి జిల్లాలో చేసుకుంది. శుక్రవారం టీఎస్‌ఎండీసీ అడిషనల్ జనరల్ మేనేజర్ ఏ.ఆనంద్ (హెచ్‌ఆర్) తాండూరు గనుల శాఖ అసిస్టెంట్ డెరైక్టర్ కార్యాలయాన్ని సందర్శించారు. మైన్ ఏడీ జయరాజ్‌తో పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలు, అమ్మకాలపై ఒప్పందం చేసుకున్నారు. అనంతరం అడిషనల్ జనరల్ మేనేజర్ ఆనంద్ వివరాలు వెల్లడించారు.
 
  నిజామాబాద్ జిల్లాలో ఐదు పట్టా భూముల్లో యజమానులతో ఒప్పందాలు జరిగాయన్నారు. రంగారెడ్డి జిల్లా తాండూరు డివిజన్‌లోని యాలాల మండలంలో రాజశేఖరరెడ్డి (ఎకరం 30 గుంటలు), విజయ్‌కుమార్‌రెడ్డి (ఎకరం) పట్టాభూముల్లో ఇసుక తవ్వకాలకు అగ్రిమెంట్ కుదిరిందన్నారు. రాజశేఖరరెడ్డి భూమిలో 21,300 క్యూబిక్ మీటర్లు, విజయ్‌కుమార్‌రెడ్డి భూమిలో 12,240 క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వకాలు, అమ్మకాలకు ఒప్పందం జరిగిందని వివరించారు. ఒక క్యూబిక్ మీటర్ ఇసుకను రూ.600కు విక్రయించనున్నట్టు ఆయన తెలిపారు. జిల్లాతోపాటు తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రాంతానికి ఇసుక కావాలన్న విక్రయిస్తామన్నారు. ఆన్‌లైన్‌లో రూ.600 చెల్లించి ఇసుకను బుకింగ్ చేసుకోవచ్చన్నారు. ఆన్‌లైన్‌లో ఇసుక బుకింగ్ చేసుకోవడానికి ఠీఠీఠీ.్టటఝఛీఛి.్ట్ఛ్చజ్చ్చ.జౌఠి.జీ వెబ్‌సైట్‌ను సందర్శించాలని చెప్పారు.
 
 తెలంగాణలోని మిగితా జిల్లాల్లో కూడా పట్టా భూముల్లో ఇసుక తవ్వకాల ఒప్పందాల ప్రక్రియ తుది దశలో ఉన్నాయన్నారు. త్వరలోనే ఆయా జిల్లాల్లో కూడా ఇసుక తవ్వకాలు చేపట్టనున్నట్టు చెప్పారు. తవ్వకాలు పూర్తయ్యే వరకు లేదా ఆరు నెలలపాటు పట్టా భూముల యజమానులతో ఒప్పందం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. యాలాల మండలంలో వచ్చే సోమవారం నుంచి తవ్వకాలు ప్రారంభిస్తామని తెలిపారు. రూ.600ల్లో పట్టాదారునికి రూ.200 చెల్లిస్తామని, రూ.50 తవ్వకాల ఖర్చులతోపాటు గనుల శాఖకు సీనరేజ్  చెల్లించడం జరుగుతుందన్నారు. మిగితా డబ్బులు ప్రభుత్వ ఖాతాలో జమ చేయడం జరుగుతుందని ఆనంద్ వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement