
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో విద్యుత్ ఉద్యోగుల కృషితో కరెంటు కష్టాలు తగ్గాయని, సీఎం చొరవతో కొన్నాళ్లకే రాష్ట్రంలో విద్యుత్ సమస్యలను అధిగమించారని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అన్నారు. గురువారం హైదరాబాద్లోని తెలంగాణ ఇంజనీర్స్ భవన్లో ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా రాష్ట్ర ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డుల ప్రదానోత్సవానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇంధన పొదుపు పాటించిన ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు గవర్నర్ అవార్డులను ప్రదానం చేశారు. ప్రతి ఒక్కరూ విద్యుత్ ఆదా చేయాలని సూచించారు. సౌర విద్యుత్ వైపు అడుగులు పడాలని, వ్యవసాయ రంగంలో సౌర శక్తి వినియోగాన్ని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. రాజ్భవన్లో వందశాతం సౌర విద్యుత్నే వాడుతున్నామని, వచ్చే ఏడాదికి ఇంజనీర్స్ భవనాన్ని సోలార్ ఎనర్జీ బిల్డింగ్గా మార్చాలని సూచించారు. కార్యక్రమంలో ట్రాన్స్కో, జెన్కో సీఎండీ ప్రభాకర్రావు, విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ మిశ్రా, విద్యుత్ రంగ నిపుణులు పాల్గొన్నారు.
గోల్డ్ కేటగిరీలో..
కేటగిరీ: అవార్డు పొందిన సంస్థ
ఇండస్ట్రీ సెక్టార్: ఐటీసీ లిమిటెడ్, భద్రాచలం
గవర్నమెంట్ బిల్డింగ్ సెక్టార్: ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ కాంప్లెక్స్ బిల్డింగ్, సికింద్రాబాద్
కమర్షియల్ బిల్డింగ్ సెక్టార్: ఇన్ఫోసిస్ లిమిటెడ్
అర్బన్ లోకల్ బాడీ సెక్టార్: హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లయ్ అండ్ సివరేజ్ బోర్డు
సిల్వర్ కేటగిరీలో..
ఇండస్ట్రీ సెక్టార్: థోషిబా ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్ (రుద్రారం)
గవర్నమెంట్ బిల్డింగ్ సెక్టార్: రాజ్భవన్,
జనరల్ పోస్ట్ ఆఫీస్
కమర్షియల్ బిల్డింగ్ సెక్టార్: టెక్ మహీంద్రా లిమిటెడ్
ట్రాన్స్పోర్ట్ సెక్టార్: ఆర్టీసీ వరంగల్ విభాగం
అర్బన్ లోకల్ బాడీ సెక్టార్: జీహెచ్ఎంసీ