సూత్రధారికీ జైలు తప్పదు: తెలంగాణ మంత్రులు | Telangana ministers takes on chandrababu naidu | Sakshi
Sakshi News home page

సూత్రధారికీ జైలు తప్పదు: తెలంగాణ మంత్రులు

Jul 2 2015 10:13 PM | Updated on Sep 3 2017 4:45 AM

ఓటుకు కోట్లు కేసులో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డితోపాటు దీంతో సంబంధం ఉన్న వారెవరూ చట్టం నుంచి తప్పించుకోలేరని తెలంగాణ మంత్రులు పేర్కొన్నారు.

హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసులో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డితోపాటు దీంతో సంబంధం ఉన్న వారెవరూ చట్టం నుంచి తప్పించుకోలేరని తెలంగాణ మంత్రులు పేర్కొన్నారు. ఈ కేసులో పాత్రదారి జైలుకు వెళ్లాడని, సూత్రధారి కూడా వెళ్లక తప్పదన్నారు. మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి గురువారం టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుత టీడీపీ ఎన్టీఆర్ ఆశయాలకు ఎప్పుడో నీళ్లొదిలిందని, ఇప్పుడున్న నేతలు స్వార్థంతో ఎన్టీఆర్, పార్టీ పరువును బజారుకీడుస్తున్నారని విమర్శించారు.

రూ. 10 వేలు లంచం తీసుకుంటే మంత్రిని సస్పెండ్ చేసిన పార్టీలో రూ.50 లక్షలు లంచం ఇచ్చిన వారికి హారతులు పడుతున్నారని తుమ్మల ఎద్దేవా చేశారు. ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన కేసులో బెయిల్ వస్తే.. ఓ గొప్ప వ్యక్తికి, స్వాత్రంత్య్ర సమర యోధునికి స్వాగతం పలికినట్లు చేయడం విడ్డూరమని పోచారం వ్యాఖ్యానించారు. నామినేటెడ్ ఎమ్మెల్యే డబ్బులు ఇస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడి ఇరికించారని బుకాయిస్తున్నారని అన్నారు. రేవంత్‌కు బెయిల్ మాత్రమే వచ్చిందని మళ్లీ జైలుకు వెళ్లక తప్పదన్నారు. చంద్రబాబు ఈ కేసు నుంచి తప్పించుకోలేరని, అసలు కథ ముందుందని, రెండు రోజుల్లో ఏం జరుగుతుందో రుచి చూస్తారని మహేందర్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

Advertisement
 
Advertisement
Advertisement