అనాథ పిల్లల బాధ్యత ప్రభుత్వానిదే | telangana cabinet decisions | Sakshi
Sakshi News home page

అనాథ పిల్లల బాధ్యత ప్రభుత్వానిదే

Jun 11 2015 3:18 AM | Updated on Sep 3 2017 3:31 AM

కేబినెట్ భేటీ నిర్ణయాలను మీడియాకు వివరిస్తున్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు

కేబినెట్ భేటీ నిర్ణయాలను మీడియాకు వివరిస్తున్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు

రాష్ట్రంలోని అనాథ బాలబాలికలకు ప్రభుత్వమే తల్లిదండ్రులుగా నిలబడుతుందని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు భరోసా ఇచ్చారు. ఇకపై తెలంగాణలో అనాథలెవరూ ఉండబోరని.. అలాంటి పిల్లల ఉన్నత చదువులు, బాగోగుల బాధ్యతను ప్రభుత్వమే చూసుకుంటుందని ప్రకటించారు.

- వారి చదువులు, బాగోగులన్నీ చూసుకుంటాం: కేసీఆర్
- పాలమూరు, డిండి ఎత్తిపోతల పథకాలకు ఆమోదం
- జూలై నుంచి 25 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు.. కేబినెట్ నిర్ణయాలు
 
సాక్షి, హైదరాబాద్:
రాష్ట్రంలోని అనాథ బాలబాలికలకు ప్రభుత్వమే తల్లిదండ్రులుగా నిలబడుతుందని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు భరోసా ఇచ్చారు. ఇకపై తెలంగాణలో అనాథలెవరూ ఉండబోరని.. అలాంటి పిల్లల ఉన్నత చదువులు, బాగోగుల బాధ్యతను ప్రభుత్వమే చూసుకుంటుందని ప్రకటించారు.

‘‘పదో తరగతి వరకు అనాథ పిల్లలను చదివించేందుకు కస్తూర్బా పాఠశాలలున్నాయి. ఆ తర్వాతేం చేయాలో, ఎక్కడికి పోవాలో తెలియని దిక్కుతోచని, దయనీయ స్థితిలో ఉన్న వారిని ఆదుకోవడం సామాజిక బాధ్యతగా ప్రభుత్వం తీసుకుంటుంది. దేశం మొత్తం అనుసరించే గొప్ప కార్యక్రమంగా ఇది ఉండాలని భావిస్తున్నాం.

అనాథ పిల్లలను ఎక్కడ చేర్పించాలి, ఎక్కడ చదివించాలి, ఏమేం ఏర్పాట్లు చేయాలనే విధివిధానాలు ఖరారు చేసేందుకు ఉప ముఖ్యమంత్రి కడియం  అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించాం. మంత్రులు ఈటల, జోగు రామన్న, చందూలాల్, లక్ష్మారెడ్డి కమిటీలో సభ్యులుగా ఉంటారు. వారం పది రోజుల్లో నివేదిక అందిస్తారు..’’ అని కేసీఆర్ ప్రకటించారు. బుధవారం జరిగిన మంత్రివర్గ భేటీలో తీసుకున్న పలు కీలకమైన నిర్ణయాలను సీఎం విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

- పాలమూరు జిల్లా ప్రజలకు తాగు, సాగునీటిని అందించేందుకు 35,250 కోట్లతో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు. ఫ్లోరైడ్ పీడిత నల్లగొండ జిల్లాకు శాశ్వత పరిష్కారం చూపేలా 6,190 కోట్లతో డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు. శ్రీశైలం రిజర్వాయర్ నుంచే పాలమూరుకు 70 టీఎంసీలు, డిండి ఎత్తిపోతలకు 30 టీఎంసీలు నీటి తరలింపు. అదనంగా హైదరాబాద్‌కు 20 టీఎంసీలు.

- గీత కార్మికులు, మత్స్యకారులకు రూ.5 లక్షల బీమా పథకం అమలు. ప్రీమియంను ప్రభుత్వమే చెల్లిస్తుంది. రిజిస్టర్డ్ సొసైటీల్లోని కార్మికులకే ఇది వర్తిస్తుంది.

- విదేశాల్లో ఉన్నత విద్య కోసం మైనారిటీ విద్యార్థులకు ప్రభుత్వ ఆర్థిక సాయం. బడ్జెట్‌లో రూ.25 కోట్లు కేటాయింపు. మైనారిటీ విద్యార్థులకు 10 గురుకుల పాఠశాలలు, 10 వసతి గృహాల ఏర్పాటు. హా పాఠశాలలు, హాస్టళ్లలో విద్యార్థులకు  కడుపు నిండా భోజనం, రోజు విడిచి రోజు కోడిగుడ్డు.

- నిజామాబాద్ జిల్లా రుద్రూరులో ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కాలేజీ ఏర్పాటు.

- ఈనెల 12న లాంఛనంగా టీఎస్ ఐపాస్ ప్రారంభం. ప్రపంచంలో ఎక్కడా లేనంత సరళంగా ఉండేలా ఖరారుకు నిర్ణయం.

- జూలై నుంచి 25 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ల జారీ. వయోపరిమితి సడలింపుపై సీఎస్ ఆధ్వర్యంలోని కమిటీ నివేదిక ఆధారంగా నిర్ణయం.

- కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు స్క్రీనింగ్. స్థానికులైన కాంట్రాక్టు ఉద్యోగులకు మాత్రమే క్రమబద్ధీకరణ వర్తింపు.

Advertisement
 
Advertisement
Advertisement