ప్రేమ పేరుతో పురుగుల మందు తాగించిన టీచర్‌ | Teacher Harassed The Student At Vikarabad District | Sakshi
Sakshi News home page

ప్రేమ పేరుతో పురుగుల మందు తాగించిన టీచర్‌

Nov 13 2019 5:21 AM | Updated on Nov 13 2019 8:13 AM

Teacher Harassed The Student At Vikarabad District - Sakshi

సాక్షి, వికారాబాద్‌: కంప్యూటర్‌ విద్యను బోధించే ఓ ఔట్‌సోర్సింగ్‌ ఉపాధ్యాయుడు ఓ విద్యార్థినిని బలవంతంగా తీసుకొచ్చి పురుగుల మందు తాగించి, తానూ తాగి ఆత్మహత్యకు యత్నించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సంగారెడ్డి జిల్లా ఆందోల్‌కు చెందిన రేణిగుంట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శ్రీశైలం అనే యువకుడు కంప్యూటర్‌ టీచర్‌గా పనిచేస్తున్నాడు. ఇదే పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న ఓ బాలికను   ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. విషయం తెలిసిన బాలిక తల్లిదండ్రులు అతన్ని హెచ్చరించినా తీరు మారలేదు. ఇదిలాఉండగా సోమవారం మధ్యాహ్న భోజన సమయంలో సదరు బాలికను కారులో ఎక్కించుకున్న శ్రీశైలం.. సంగారెడ్డి వైపు వెళ్లినట్లు తోటి విద్యార్థులు హెచ్‌ఎంకు తెలిపారు. దీంతో హెచ్‌ఎం అతనికి ఫోన్‌ చేయగా స్పందించలేదు.

మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు పాఠశాల ఉపాధ్యాయులతో పాటు, యువకుడి కుటుంబీకులు పలుమార్లు ఫోన్‌చేసి ప్రశ్నించడంతో తాము వికారాబాద్‌లో ఉన్నామని సంగారెడ్డి వస్తున్నట్లు తెలిపాడు. అప్పటికే యువకుడి కుటుంబీకులు కొందరు వారిని వెతుక్కుంటూ వచ్చారు. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో కొత్తగడి వద్ద వీరు ఎదురుపడ్డారు. అప్పటికే ఇద్దరూ పురుగుల మందు తాగినట్లు గుర్తించి వికారాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అయితే శ్రీశైలం బలవంతంగా పురుగుల మందు తాగించాడని బాలిక తెలిపింది. యువకుడి పరిస్థితి బాగానే ఉందని, బాలిక పరిస్థితే కొంత విషమంగా ఉన్నట్లు సమాచారం. బాలిక తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలియడంతోనే ఆమెకు ఎక్కువ మొత్తంలో పురుగుల మందు తాగించి.. శ్రీశైలం కొంతే తాగినట్లు తెలిసింది.

Advertisement
 
Advertisement
Advertisement