అప్పులు ఉన్నంత మాత్రాన రైతులు ఆత్మహత్యలకు పాల్పడడం సరికాదని, కాంగ్రెస్, టీడీపీ నేతల మాటలతోనే వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ప్రభుగౌడ్ పేర్కొన్నారు.
మెదక్, రూరల్: అప్పులు ఉన్నంత మాత్రాన రైతులు ఆత్మహత్యలకు పాల్పడడం సరికాదని, కాంగ్రెస్, టీడీపీ నేతల మాటలతోనే వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ప్రభుగౌడ్ పేర్కొన్నారు. మెదక్ మండలం నాగపూర్ గ్రామానికి చెందిన ఏసు అప్పుల బాధతో ఈనెల 15న ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. కాగా విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ప్రభుగౌడ్ సోమవారం మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు.
అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రూ.లక్ష లోపు రైతుల రుణాలను మాఫీ చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారని, అయినప్పటికీ జిల్లాలో ఆత్మహత్యలు ఆగడం లేదన్నారు. రైతులకు ధైర్యం చెప్పాల్సి కొన్నిపార్టీలు వారిని అధైర్య పరుస్తున్నాయని పరోక్షంగా టీడీపీ, కాంగ్రెస్ పార్టీ నేతలను విమర్శించారు. కలెక్టర్ చొరవచూపి గ్రామాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ఆత్మహత్యలను నివారించాలని కోరారు. రైతురుణాల మాఫీతో పాటు తెలంగాణ అభివృద్ధికి అన్ని విధాల కృషిచేస్తానని కేసీఆర్ స్పష్టమైన హామీ ఇచ్చారన్నారు. ఆయన వెంట పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఏసుదాసు ఉన్నారు.
రైతుల ఆత్మహత్యలు దురదృష్టకరం
మెదక్ మున్సిపాలిటీ:ప్రభుత్వం రైతు రుణాలను మాఫీ చేస్తున్నట్లు ప్రకటించినా రైతులు ఆత్మహత్యలకు పాల్పడం దురదృష్టకరమని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ప్రభు గౌడ్ పేర్కొన్నారు. సోమవారం ఆయన మెదక్ ఆర్అండ్బీ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడుతూ ప్రతిపక్షాలు రుణమాఫీపై ప్రభుత్వం చేసిన ప్రకటనను వక్రీకరించడంవల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. అంతకు ముందు ఆయన టేక్మాల్లో ఇటీవల మృతి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు రామయ్య కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన వెంట అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ క్రీస్తుదాస్, సుధాకర్ తదితరులు ఉన్నారు.