కరోనాతో గుండెకు చేటు!  | Sakshi
Sakshi News home page

కరోనాతో గుండెకు చేటు! 

Published Thu, Jul 2 2020 11:36 AM

Survey Says Heart Problems Increasing Due To Coronavirus Pandemic - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ విజృంభిస్తున్న తరుణంలో గుండె జబ్బులు కూడా పెరుగుతున్నాయి. వాస్తవానికి ఈ సమస్య కోవిడ్‌–19 పరీక్షల్లో బయటపడడం లేదు. 80 శాతం మేరకు కరోనా కేసుల్లో ఎలాంటి లక్షణాలు బయటపడకపోవడం గమనార్హం. కోవిడ్‌ బాధితుల్లో 5 శాతం కంటే తక్కువగానే గుండె సంబంధిత వ్యాధులను చూడవచ్చు. వృద్ధులు, అంతకు ముందు నుంచే అధిక రక్తపోటు, మధుమేహం, వృద్ధులైన గుండెపోటు రోగులలో ఈ సమస్య ఎక్కువగా కన్పిస్తున్నది.

రోగ నిరోధక శక్తి ఉంటే కోవిడ్‌ మహమ్మారిని విజయవంతంగా ఎదుర్కొంటున్నట్టు వైద్యులు పేర్కొంటున్నారు. వాస్తవానికి రొటీన్‌గా చేసే పరీక్షలలోనే గుండెకు సంబంధించిన సమస్యలు బయటపడుతున్నాయి. ఎక్కువగా గుండెలో మంట, రోగ నిరోధక క్రియాశీలత, రక్తంలోకి పెద్ద ఎత్తున రోగ నిరోధకత సైటోకైన్‌లు విడుదల కావడం, షాక్, జర్వంతోపాటు ఇతర లక్షణాల వల్ల రక్తపోటుకు గురవుతుంటారు. దాంతో శరీరంలో ఒకేసారి అనేక అవయవాలు వైఫల్యం చెందడంతో పాటు కిడ్నీ, లివర్‌ పనిచేయడం నిరాకరిస్తాయి. ముఖ్యంగా కార్డియో వాస్కులర్‌ లక్షణాల విషయానికి వస్తే.. గుండెకు రక్తం సరఫరా చేసే ప్రధాన రక్తనాళం మూసుకుపోవడం వల్ల అక్యూట్‌ ఎమ్‌ఐ–స్టెమి(అక్యూట్‌ హార్ట్‌ అటాక్‌) ఏర్పడే ప్రమాదం ఉంది.

ఊపిరితిత్తుల సమస్య, రక్తంలో ఆక్సిజన్‌ కలిసే సమస్య కారణంగా రక్తంలో నిరంతర ఆక్సిజన్‌ సంతృప్తత (హైపోక్సియా) చాలా తక్కువకు పడిపోయినప్పడు ఆకస్మిక గుండె పోటుకు దారితీస్తుంది. మెదడు రక్తనాళాల్లో అసాధారణ రీతిలో రక్తం గడ్డకట్టడం, ఆకస్మిక పక్షవాతం రావడం గానీ, ఒక చేయి లేక ముఖంలో ఒక వైపు బలహీనతకు దారితీసే అవకాశం ఉంది. అదే గుండె చుట్టూ ద్రవం ఏర్పడటంతో తక్కువ రక్తపోటు, షాక్‌కు లోనవడం సంభవిస్తుంది. గుండె కండరాలలో ఇన్‌ఫెక్షన్, మంట, వాపులు బ్లడ్‌ పంపింగ్‌ వైఫల్యానికి దారి తీస్తాయి. దీంతో రక్తపోటు తగ్గిపోతుంది. కానీ షాక్‌ ఏర్పడుతుంది.  

Advertisement

తప్పక చదవండి

Advertisement