
విద్యార్థుల కిడ్నాప్ డ్రామా..
తమను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కళ్లకు గంతలు కట్టి కిడ్నాప్ చేశారని, ఆటోలో వెళుతుండగా స్పీడ్ బ్రేకర్ దగ్గర ఆటోలో...
గండేడ్: తమను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కళ్లకు గంతలు కట్టి కిడ్నాప్ చేశారని, ఆటోలో వెళుతుండగా స్పీడ్ బ్రేకర్ దగ్గర ఆటోలో నుంచి కిందికి దూకి, పాఠశాలలోకి చేరుకున్నామని గండేడ్ మండలంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు ఉపాధ్యాయులకు తెలిపారు. ఉపాధ్యాయులు అందించిన సమాచారం మేరకు మహమ్మదాబాద్, హన్వాడ ఎస్ఐలు ఆ పాఠశాలలో విచారణ జరిపారు. విద్యార్థులు చెప్పిన మేరకు ఆటో వెళ్లిన కోస్గి మండలానికి వెళ్లి కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన ఆటో కోసం ఆరా తీశారు.
తర్వాత అక్కడి నుంచి హన్వాడ మండలానికి వెళ్లి పాఠశాల సిబ్బంది, వారి తల్లిదండ్రులతో కలిసి పోలీసులు ఆ విద్యార్థులను విడివిడిగా విచారించగా.. అసలు విషయం (కిడ్నాప్ డ్రామా అనే విషయం) బయటపడింది. పోలీసులు, పాఠశాల సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలం పెద్ద దర్పల్లి గ్రామ యాదవకాలనీకి చెందిన మల్లేష్ కూ తురు ప్రియాంక (ఐదో తరగతి), కుమారుడు గణేష్ (ఒకటో తరగతి) ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నారు. ప్రతి రోజులానే సోమవారం ఉదయం అక్కాతమ్ముళ్లు ఇద్దరూ బస్సులో హన్వాడ పాఠశాల దగ్గర దిగారు.
అక్కడి నుంచి గండేడ్ మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న పెద్దనాన్న కొడుకు శ్రీకాంత్ దగ్గరికి ఆటోలో వచ్చారు. ఎందుకు ఇక్కడికి వచ్చారని వారి అన్న అడుగ్గా తాము రాలేదని, తమను కొందరు వ్యక్తులు ఆటోలో కిడ్నాప్ చేసి తీసుకువెళుతుండగా, ఇక్కడ ఆటోలో నుంచి దూకి వచ్చామని చెప్పారు. దీంతో శ్రీకాంత్ వారిని పీఈటీ భాస్కర్రెడ్డి దగ్గరకు తీసుకువెళ్లాడు. దీంతో పీఈటీ స్థానిక మహమ్మదాబాద్, హన్వాడ పోలీసులకు సమాచారమందించారు. వెంటనే ఇద్ద రు ఎస్ఐలు వెంకటేశ్వర్గౌడ్, గడ్డం కాశీ తమ సి బ్బందితో గండేడ్ పాఠశాలకు చేరుకుని, వారిని తీసుకుని ఆటో ఎక్కడికి వెళ్లిందని ఆరా తీశారు.
ఈ క్రమంలో కోస్గికి వెళ్లి ఆటో నడుపుతున్న వారి నుంచి వివరాలు సేకరించారు. అయితే విద్యార్థులు చెప్పిన కిడ్నాప్ విషయం పొంతన కుదరకపోవడంతో హ న్వాడ పోలీసులు వారిని పోలీస్టేషన్కు తీసుకువెళ్లారు. అక్కడ పాఠశాల సిబ్బంది, పిల్లల తల్లిదండ్రులతో కలిసి విచారించారు. విద్యార్థులను, తల్లిదండ్రులను విడివిడిగా విచారణ చేశారు. దీంతో అప్పటివరకు తమనెవరో కిడ్నాప్ చేశారని చెప్పిన గణేష్.. తమను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, తమ సోదరుడిని చూడటానికి వెళ్లామని తెలిపారు. విషయం తె లుసుకున్న పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. పోలీ సులు విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.