స్నేక్ గ్యాంగ్ అకృత్యాలను వెలుగులోకి తీసుకొచ్చిన బాధితురాలి సోదరుడిపై గుర్తు తెలియని వ్యక్తులు హత్యాయత్నానికి పాల్పడ్డారు.
రంగారెడ్డి: స్నేక్ గ్యాంగ్ అకృత్యాలను వెలుగులోకి తీసుకొచ్చిన బాధితురాలి సోదరుడిపై గుర్తు తెలియని వ్యక్తులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన మైలార్దేవ్పల్లి పోలీసుస్టేషన్ పరిధిలో శనివారం రాత్రి జరిగింది. దుండగుల దాడి నుంచి తప్పించుకున్న సదరు వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు.
గతేడాది జూలైలో ఓ ఫాంహౌస్కు వెళ్లిన ప్రేమ జంటను స్నేక్గ్యాంగ్ నిర్బంధించి... యువతిపై అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. బాధితురాలు అప్పట్లో పహాడీషరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో స్నేక్ గ్యాంగ్ అకృత్యాలు వెలుగు చూడడమే కాకుండా... ముఠాలోని సభ్యులు కటకటాల పాలయ్యారు. కాగా, బాధితురాలి సోదరుడు షంషీర్ఖాన్(18) తన బాబాయితో కలిసి కారులో శనివారం రాత్రి మెహదీపట్నం నుంచి చాంద్రాయణగుట్ట బయలు దేరారు. అదే సమయంలో అరాంఘర్ బైపాస్ రోడ్డులోని మార్కండేయనగర్ వద్ద పది మంది గుర్తు తెలియని వ్యక్తులు కారును అడ్డగించి కత్తులతో దాడి చేసేందుకు యత్నించారు. బాధితుడు వారి నుంచి తప్పించుకొని పోలీసులను ఆశ్రయించాడు. తనపై గుర్తు తెలియని వ్యక్తులు మరణాయుధాలతో హత్యాయత్నానికి పాల్పడ్డాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.