మా హయాంలోనే అది సాధ్యం.. | Sakshi
Sakshi News home page

భాషకు పట్టం

Published Sat, Dec 23 2017 9:50 AM

singi reddy niranjan reddy speech in telugu cultural festivals - Sakshi

మా హయాంలోనే అది సాధ్యం సమైక్య రాష్ట్రంలో తెలంగాణ యాస, భాష వివక్షతకు గురయ్యాయి..ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి శ్రీరంగాపురంలో తెలుగు సాహిత్య, సాంస్కృతిక ఉత్సవాలు హాజరైన బుర్రా వెంకటేశం, కలెక్టర్లు, జెడ్పీ చైర్మన్, ఎమ్మెల్యేలు పెద్దసంఖ్యలో పాల్గొన్న కవులు, కళాకారులు ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగిన కార్యక్రమాలు.

సాక్షి వనపర్తి: మనిషిలో కలిగే ఆలోచనను ఇతరులకు తెలియజేసేదే భాష అని అలాంటి తెలుగు భాషకు తెలంగాణ రాష్ట్రం పట్టం కట్టిందని రాష్ట్ర ప్రణాళికా సం ఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం వనపర్తి జిల్లా శ్రీరంగాపురం లోని రంగనాథస్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన తెలుగు సాహిత్య సాంస్కృతిక ఉత్సవాలు–2017 ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. కొన్నేళ్లుగా ఉమ్మడి రాష్ట్రంలో భాషా పండితుల నియామకాలే జరుగలేదని, భాషా కళాశాలల ప్రారంభానికి కూడా నోచుకోలేదని అన్నా రు. ఇటీవల ముగిసిన ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలుగుభాషను కాపాడేందుకు త్వర లోనే భాషా పండితుల నియామకం, కళాశాలల ప్రారంభం చేపట్టనున్నామని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ప్రకటించినట్లు నిరంజన్‌రెడ్డి తెలిపారు. 12వ తరగతి వరకు తెలుగు అంశాన్ని తప్పనిసరిగా చేర్చుతున్నట్లు ప్రభుత్వం ఇటీవలే ప్రకటించడం హర్షణీయమన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ భాష, యాసను విలన్లు, జోకర్ల పాత్రల ద్వారా కించపరిచారని, ఇతరుల భాష ను వ్యతిరేకించరాదని అన్నారు. తెలుగుభాష పేరుతో ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాలను ఒక్కటిగా చేసి 60ఏళ్ల పాటు తెలంగాణ భాష, యాస, ప్రజలను అణిచివేశారని అన్నారు. తెలంగాణ ఉద్యమం భాష, యాస, నిధులు, నీళ్లు, కొలువుల కోసమే జరిగిందని ఆయన తెలిపారు. 1969లో మొదలైన తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ వచ్చే వరకు కాపాడింది కవులు, కళాకారులేనని, వారి పాటే కోట్లాది మంది ప్రజలను కదిలించిం దని నిరంజన్‌రెడ్డి తెలిపారు. తెలుగు సాహిత్య సాం స్కృతిక సభల సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక సారథి సాయిచంద్‌ బృందం పాడిన పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. జిల్లాలోని పలు పాఠశాలల విద్యార్థు లు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు తెలుగుభాష గొప్పతనాన్ని చాటాయి. కార్యక్రమంలో డీఆర్‌ఓ చంద్ర య్య, ఆర్‌డీఓ చంద్రారెడ్డి, డీఆర్‌డీఓ గణేష్, డీపీఓ వీరబుచ్చయ్య, డీపీఆర్‌ఓ వెంకటేశ్వర్లు, పలువురు ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

శ్రీరంగాపూర్‌కు గొప్ప విశిష్టత
ఉమ్మడి రాష్ట్రంలో మన భాషకు అవమానం జరిగింది. హైదరాబాద్‌ చుట్టుపక్కల ఉం డే జిల్లాల్లో ఉర్దూ యాస ఉండడం వల్ల ఇతరులు అవమానించేవారు. తెలుగు భాషాభివృద్ధికి, సంస్కృతికి శ్రీరంగాపూర్‌ ఎంతో గొప్పది. ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన తెలుగు మహాసభలకు 42దేశాల నుంచి ప్రతినిధులు రావడం గర్వించదగ్గ విషయం. నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి వనపర్తి మొదటి ఎమ్మెల్యే కావడం మా అందరి అదృష్టం. పర్యాటక కేంద్రంగా శ్రీరంగాపూర్‌ అభివృద్ధి చెందాలంటే రంగసముద్రం రిజర్వాయర్‌లో బోటింగ్‌ ఏర్పాటు చేయాలి. – చిన్నారెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే

తెలుగుభాష గొప్పది
తెలుగుభాష ఎంతో గొప్పది. ప్రభుత్వం తెలుగు మహాసభల ద్వారా భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటింది. మన జిల్లాలో కూడా ఘనంగా తెలుగు మహాసభలు నిర్వహించుకోవడం సంతోషకరమైన విషయం. జిల్లాలోని కవులు, కళాకారులను సన్మానించుకోవడం మన అదృష్టంగా భావిస్తున్నాం. – శ్వేతమహంతి, కలెక్టర్, వనపర్తి జిల్లా

తెలుగు తల్లిలాంటిది
తెలుగుభాష కన్నతల్లి లాంటిది. మాతృభాషలో మాట్లాడితే పొందే మాధుర్యం మరేభాషకు దక్కదు. దక్షిణాది రాష్ట్రాలలో తెలుగుభాషకు ఎంతో గొప్ప పేరుంది. ఈ ప్రాంతంలో తెలుగు మహాసభలను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది.  -రోహిణి ప్రయదర్శిని, ఎస్పీ, వనపర్తి జిల్లా

Advertisement
Advertisement