సాక్షి, ఢిల్లీ: యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో దేశ రక్షణకు బడ్జెట్లో నిధులు పెంచాలని వైఎస్సార్సీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి అన్నారు. రాజ్యసభలో ఇవాళ ఫైనాన్స్ బిల్లుపై చర్చ జరిగింది. వైఎస్సార్సీపీ తరఫున చర్చలో నిరంజన్ రెడ్డి మాట్లాడారు.
‘అన్ని రకాల సెస్ లు రద్దుచేసి... డిఫెన్స్ సెస్ మాత్రమే విధించాలి. ఆ నిధులను క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కు మాత్రమే ఖర్చు చేయాలి. ప్రపంచలో అన్ని దేశాలు రక్షణ బడ్జెట్ పెంచాయి. దేశ జీడీపీలో కేవలం రెండు శాతంలోపు మాత్రమే రక్షణపై ఖర్చు పెడుతున్నారు. ఇందులో సింహభాగం జీతాలు, పెన్షన్లకే వెళుతుంది. అత్యాధునిక ఆయుధాలను సమకూర్చుకోవాలి, రీసెర్చ్ కి నిధులు కేటాయించాలి.
అన్ని రకాల సెస్ ఛార్జీలను రద్దు చేయాలి. న్యాయవ్యవస్థకు నిధుల కేటాయింపు పెంచాలి. జీడీపీలో 1.5% మాత్రమే న్యాయవ్యవస్థకు ఖర్చు పెడుతున్నారు. 5 కోట్ల పెండింగ్ కేసులు ఉన్నాయి. ప్రతి ఏడాది సుప్రీంకోర్టులో 70 వేల కేసులు ఫైల్ అవుతున్నాయి. జడ్డీలపై పని భారం పెరుగుతోంది. ప్రస్తుతం సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్య కేవలం 36 మాత్రమే. దీన్ని కేసుల సంఖ్యకి అనుగుణంగా పెంచాలి’ అని అన్నారు.


