పాతాళగంగ | Shadows groundwater drought | Sakshi
Sakshi News home page

పాతాళగంగ

Mar 21 2016 3:13 AM | Updated on Sep 3 2017 8:12 PM

జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఫిబ్రవరి చివరి నాటికే జిల్లా లో 33 మండలాల్లో ప్రమాదకర స్థాయికి పడిపోయాయి.

అడుగంటుతున్న భూగర్భ జలాలు
పది మీటర్ల లోతుకు పడిపోయిన నీటిమట్టం
33 మండలాల్లో కరువు ఛాయలు
గతేడాది కంటే ఎక్కువ లోతులో నీరు
వేసవిలో తాగునీటికి తిప్పలే...

 
హన్మకొండ :  జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఫిబ్రవరి చివరి నాటికే జిల్లా లో 33 మండలాల్లో ప్రమాదకర స్థాయికి పడిపోయాయి. వేసవి ప్రారంభంలోనే నీటి కటకట తప్పేలా లేదు. అధికార యంత్రాం గం ఇప్పటి నుంచే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపోతే ఈ వేసవిలో జిల్లా వాసులకు తాగునీటి గండం తప్పేలా లేదు. ఈ ఏడాది జిల్లాలో సగటు వర్షపాతం  33 శాతం తక్కువగా నమోదైంది. వరుసగా రెండేళ్లు ఇదే పరిస్థితి నెలకొనడంతో చెరువులు, కుంటల్లో నీటి నిల్వ తగ్గిపోయింది. దీనికి తోడు వర్షాభావ పరిస్థితులతో రైతులు ఖరీఫ్, రబీ సీజన్లలో బోరుబావులపైనే ఆధారపడాల్సి వచ్చింది. ఫలితంగా భూగర్భ జలవనరులు తగ్గుముఖం పట్టాయి. కరువు ప్రాంతం, అటవీప్రాంతం అనే తేడా లేకుండా జిల్లా అంతటా అడుగంటారుు. జిల్లాలో కరువు ప్రాంతంగా పేర్కొనే జనగామ సబ్ డివిజన్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది.

33 మండలాల్లో నీటి కటకట..
భూగర్భ జలవనరుల శాఖ లెక్కల ప్రకారం భూ ఉపరితలం నుంచి ఎనిమిది మీటర్ల లోతుకు నీటిమట్టాలు పడిపోతే కరువు ఛాయలు అలుముకున్నట్లు పరిగణిస్తారు. జిల్లాలో 50 మండలాలు ఉండగా వీటిలో ఎనిమిది మీటర్లలోపు లోపు నీటిమట్టం ఉన్న మండలాలు 17 ఉన్నాయి. మిగిలిన 33 మండలాల్లో నీటిమట్టం ఎనిమిది అడుగుల కంటే కిందికే చేరుకుంది. భూగర్భ జలవనరుల విభాగం  నివేదిక 2016 ఫిబ్రవరి ప్రకారం  జిల్లా సగటు భూగర్భనీటి మట్టం 11.35 మీటర్లకు పడిపోయింది. గతేడాది ఇదే సమయానికి జిల్లా సగటు భూగర్భ నీటిమట్టం 11.10 మీటర్లుగా నమోదైంది. అంటే గతేడాది కంటే ఎక్కువ లోతుకు నీటిమట్టాలు పడిపోయాయి.
 
జనగామలో 17.81 మీటర్లకు..
జనగామ సబ్ డివిజన్ పరిధిలో ప్రస్తుతం భూగర్భ నీటిమట్టం 17.81 మీటర్లకు పడిపోయింది. గతేడాది ఇదే సమయానికి ఇక్కడ నీటిమట్టం 14.65 మీటర్లుగా నమోదైంది. డివిజన్‌లోని రఘునాథపల్లి మండలంలో భూగర్భ జలాలు 42.87 మీటర్ల లోతులోకి వెళ్లారుు. గతేడాది ఇదే సమయానికి ఈ మండలంలో 30.54 మీటర్ల లోతులో ఉండేవి. జిల్లాలోనే అత్యంత దారుణ పరిస్థితి నెలకొన్న ఈ మండలంలో భూగర్భ నీటిమట్టాలు పెంచేలా అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉంది.
 
నర్సంపేట, మహబూబాబాద్‌లో మెరుగు..
నర్సంపేట, మహబూబాబాద్ రెవెన్యూ డివిజన్లలో గతేడాదితో పోల్చితే నీటి మట్టాలు పెరిగాయి. అంతేకాదు.. ఈ నీటి మట్టాలు జిల్లా సగటు కంటే పై స్థా యిలో ఉండటం ఇక్కడి ప్రజలకు ఊరట కలిగిస్తోంది. నర్సంపేటలో గతేడాది 7.34 మీటర్ల లోతులో నీరుండగా, ఈసారి ఒక మీటరు పైకి వచ్చి 6.26 మీటర్ల లోతులో అందుబాటులో ఉన్నారుు. మహబూబాబాద్ డివిజన్‌లో గతేడాది 8.37 మీటర్ల లోతులో ఉండగా ఈసారి 6.77 మీటర్ల లోతులోనే నీరు లభిస్తోంది. జిల్లాలో అత్యంత ఎక్కువగా సంగెంలో 3.56, ఖానాపూర్ మండలంలో 3.68 మీటర్ల లోతులో భూగర్భ జలం ఉంది. అటవీ ప్రాంతం ఎక్కువగా ఉండే ములుగు రెవెన్యూ డివిజన్‌లో సైతం నీటిమట్టం పడిపోవడం ఈ ఏడాది కరువు పరిస్థితికి అద్దం పడుతోంది. ఈ డివిజన్‌లో సగటున 12 అడుగుల లోతుకి నీటిమట్టం చేరుకుంది.
 
 తాగునీటి కోసం రాస్తారోకో
నర్సంపేట :  తాగునీటి సమస్య పరిష్కరించాలంటూ మండలంలోని ఇటుకాలపల్లి పంచాయుతీ పరిధిలోని ఆకులతండాలో ఆదివారం రాస్తారోకో నిర్వహించారు. వుల్లంపల్లి-నర్సంపేట ప్రధాన రహదారిపై పలువురు మహిళలు, తండావాసులు ఖాళీ బిందెలతో ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా సీపీఎం డివిజన్ కార్యదర్శి భూక్య సవ్ముయ్యు మాట్లాడుతూ.. ప్రజలు తాగునీటికి అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తండావాసులకు నీరు అందించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement