ఆసుపత్రుల్లో పారిశుధ్యం బంద్‌

Sanitation bandh in hospitals - Sakshi

మూడు నెలలుగా వేతనాలు చెల్లించని ఏజెన్సీ 

విధులను బహిష్కరించిన ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో చాలా ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రుల్లో పారిశుధ్య సేవలు బంద్‌ అయ్యాయి. పారిశుధ్య కార్మికులకు 3 నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో వారంతా సేవలు నిలిపేశారు. జీతాలు చెల్లించేంత వరకు సేవలు నిలిపేస్తామని చెప్పారు. నాలుగైదు రోజుల కింద నుంచి సేవలు నిలిపేస్తున్నా అధికారుల నుంచి స్పందన రాకపోవడంతో మంగళవారం నుంచి నిరవధికంగా సేవలను నిలిపివేయాల ని నిర్ణయించినట్లు పారిశుధ్య కార్మికులు తెలిపారు. పారిశుధ్య కార్మికులే కాకుండా పేషెంట్‌ కేర్, సెక్యూరిటీ సేవలు కూడా నిలిచిపోయాయి. దీంతో అస్పత్రులన్నీ మందుల వ్యర్థాలతో నిండిపోయాయి.  

రూ.25 కోట్లు చెల్లించాలి.. 
రాష్ట్రంలోని ప్రధాన ఆస్పత్రులతో పాటు, మెడికల్‌ కాలేజీల్లో దాదాపు 10 వేల మంది ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది పనిచేస్తున్నారు. వారందరికీ దాదాపు రూ.25 కోట్లు చెల్లించాల్సి ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే పలుమార్లు అధికారులకు విన్నవించినా ప్రయోజనం లేకుండా పోయిందని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో వారంతా సేవలు బంద్‌ చేశారు. ఎక్కడికక్కడ ఆస్పత్రుల ఎదుట ఆందోళన చేపట్టారు.

వీరంతా ఓ ఏజెన్సీ సంస్థ పరిధిలో ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో పనిచేస్తున్నారు. గతేడాది నుంచి ఈ సంస్థ తమకు ప్రతి నెలా నిర్ణీత సమయానికి జీతాలివ్వట్లేదని సిబ్బంది వాపోతున్నారు. కాగా, పారిశుధ్య కార్మికులకు మూడు నెలలుగా జీతాలు చెల్లిం చని మాట వాస్తవమేనని వైద్య విద్య డైరెక్టర్‌ డాక్టర్‌ రమేశ్‌రెడ్డి అంగీకరించారు. తాము నిధులు విడుదల చేశామని, బుధవారం కార్మికులకు అందుతాయని పేర్కొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top