సమత కేసులో కోర్టు సంచలన తీర్పు | Samatha Case Final Verdict Today | Sakshi
Sakshi News home page

దోషులకు ఉరిశిక్ష ఖరారు చేసిన న్యాయస్థానం

Jan 30 2020 7:55 AM | Updated on Jan 30 2020 2:19 PM

Samatha Case Final Verdict Today - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన సమత కేసులో ఆదిలాబాద్‌ న్యాయస్థానం గురువారం సంచలన తీర్పు వెల్లడించింది. అనేక పరిణామాల మధ్య దోషులకు ఉరిశిక్ష ఖరారు చేస్తూ.. ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు గురువారం తుది తీర్పు ఇచ్చింది. సమత హత్యాచార నిందితులు షేక్​ బాబా, షేక్​ షాబూద్దీన్​, షేక్​ ముఖ్ధీమ్‌లను దోషులుగా నిర్ధారించి ఉరిశిక్ష విధించింది. ముందుగా నిందితులను జైలు అధికారులు కోర్టులో ప్రవేశపెట్టగా.. కోర్టు హాలులోకి పిలిచిన జడ్జి వారి కుటుంబ వివరాలను అడిగి తెలుసుకున్నారు. నేరం రుజువైందని నిందితులకు చెప్పారు. నిందితుల తరపున న్యాయవాది రహీం వాదనలు వినిపించిన రహీం.. శిక్ష తగ్గింగాలని న్యాయమూర్తిని కోరారు. కుటుంబానికి తామే ఆధారమంటూ న్యాయమూర్తి ముందు నిందితులు కన్నీరు పెట్టుకున్నారు. ముగ్గురు నిందితులకు నలుగురు పిల్లలు ఉన్నారని, శిక్ష తగ్గించాలని వేడుకున్నారు. 

కాగా సమత భర్త గోపి, కుటుంబ సభ్యులు కోర్టుకు చేరుకున్నారు. అలాగే సమత స్వగ్రామం గోనంపల్లె వాసులు సైతం కోర్టుకు భారీగా చేరుకున్నారు. దీంతో కోర్టు దగ్గర పెద్ద సంఖ్యలో పోలీసులను మొహరించారు.

కేసుకు సంబంధించిన వాదనలు ఈ నెల 20న పూర్తయ్యాయి. ఈ నెల 27న ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించాల్సి ఉండగా న్యాయమూర్తి అనారోగ్య కారణంగా ఈ నెల 30కు వాయిదా వేశారు. కొమురంభీం జిల్లా లింగాపూర్‌ అటవీ ప్రాంతంలోని ఎల్లపటార్‌లో గతేడాది నవంబర్‌ 24న సమతపై సామూహిక అత్యాచారం చేసి, ఆమెను దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement