ఈ నెల24న పెళ్లి.. ఇంతలోనే తీరని విషాదం! | Sakshi
Sakshi News home page

ఈ నెల24న పెళ్లి.. ఇంతలోనే తీరని విషాదం!

Published Sat, Nov 11 2017 9:12 AM

road accident in saroornagar - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో విషాదం చోటుచేసుకుంది. మరికొన్ని రోజుల్లో పెళ్లిపీటలు ఎక్కబోతున్న యువతిని మృత్యువు కబళించింది. వివాహ వస్త్రాలు కొనుగోలు చేసేందుకు నగరానికి వచ్చిన ఆమె రోడ్డుప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. సరూర్ నగర్ పరిధిలోని కొత్తపేటలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఖమ్మం జిల్లాకు చెందిన 21 ఏళ్ల గీత కుటుంబసభ్యులతో కలిసి వివాహ వస్త్రాలు కొనుగోలు చేసేందుకు నగరానికి వచ్చింది. కొత్తపేటలోని ఓ దుకాణంలో వస్త్రాలు కొనుగోలు చేసిన అనంతరం ఆమె కుటుంబసభ్యులతో కలిసి యమహా బైక్‌పై వెళుతుండగా.. టిప్పర్‌ వాహనం​వారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో గీత అక్కడికక్కడే మృతిచెందింది. ఈ నెల 24న గీత వివాహం కానుంది. వివాహ వస్త్రాల కోసం కుటుంబంతో సహా నగరానికి వచ్చామని, మరో పది రోజుల్లో పెళ్లి పీటల మీద కూర్చోవాల్సిన తమ కూతురుని మృత్యువు కబళించిందంటూ తల్లిదండ్రుల రోదన మిన్నంటింది. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తండ్రిదండ్రుల దుఃఖం చూపరులను కలిచివేసింది. ఈ ప్రమాదంలో మరొకరికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై సరూర్ నగర్ పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement