పార్టీ ఆదేశిస్తే పోటీ చేస్తా: రేవంత్‌రెడ్డి

Revanth to contest if party asks him - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని పార్టీ ఆదేశిస్తే తాను పోటీ చేస్తానని కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎ.రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ కష్టకాలం లో ఉన్నప్పుడు లీడర్‌గా కొన్ని తప్పవని, గెలిచినా, ఓడినా కార్యకర్తల్లో ధైర్యం నింపాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. బుధవారం అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు వార్‌జోన్‌లో ఉన్నాయని, పోరాడే సమయంలో పోరాడాల్సిందేనని, పార్టీ నాయకుడిగా అది తన బాధ్యత అని చెప్పారు.

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు కూడా ఏకపక్షంగా ఉంటాయనే ప్రచారంలో వాస్తవం లేదని, 2014 ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన బీజేపీ ఆ వెంటనే మూడు నెలల్లో వచ్చిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయిందని ఆయన ప్రశ్నించారు. సంప్రదాయాల పేరుతో స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మద్దతు తీసుకున్న టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీగా గెలిచే సంఖ్యాబలం ఉన్న కాంగ్రెస్‌పై తమ అభ్యర్థిని పోటీకి ఎలా దింపుతుందని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీ సచిన్‌ టెండూల్కర్‌ అయితే కేసీఆర్‌ గచ్చిబౌలి దివాకర్‌ అని వ్యాఖ్యానించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top