ప్రైవేట్ వ్యక్తుల ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూములను క్రమబద్ధీకరణ చేసే ఆలోచనలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ఇదివరకే నిర్మాణాలున్న భూములను గుర్తించేందుకు సర్కార్ కసరత్తు
భూముల క్రమబద్ధీకరణ, విక్రయంతో ఖజానా నింపే యత్నం
భూముల విక్రయంతో రూ.6,500 కోట్ల రాబడికి నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ వ్యక్తుల ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూములను క్రమబద్ధీకరణ చేసే ఆలోచనలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో భూముల విక్రయంతో రూ.6500 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే. దీన్ని బడ్జెట్లోనూ పొందుపర్చింది. అయితే ఇప్పటికిప్పుడు కొత్త భూములను వేలం వేయడం వల్ల.. ఆశిం చిన ఆదాయం వచ్చే అవకాశం లేదన్న భావనలో ప్రభుత్వం ఉన్నట్లు ఉన్నతాధికార వర్గాలు వివరించాయి. ఇప్పటికే అక్రమ నిర్మాణాలు చేపట్టిన స్థలాలైతే క్రమబద్ధీకరణతో బడ్జెట్లో పేర్కొన్న మేరకు కాకపోయినా.. కొంతమేరకు ఆదాయం సమకూరుతుందన్న అభిప్రాయాన్ని అధికారవర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.
ఇదే విషయంపై ఆక్రమణలకు గురైన భూములను గుర్తించే పనిలో ప్రభుత్వం నిమగ్నమైనట్లు వివరించారు. హైదరాబాద్ పరిసరాల్లోనే పెద్దఎత్తున భూములు ఆక్రమణకు గురైనట్లు ప్రభుత్వం పదేపదే చెబుతున్న విషయం విదితమే. అనుమతి లేకుండా ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవడం, నిర్మాణాలు భారీగా కొనసాగినట్లు ప్రభుత్వం భావిస్తోంది, గురుకుల్ ట్రస్ట్ భూములు, అస్సైన్డ్ భూములు, నగరం చుట్టూరా ఉన్న ప్రభుత్వ భూములు పెద్దసంఖ్యలో అన్యాక్రాంతం అయ్యాయని ప్రభుత్వం ఇదివరకే అధికారికంగా పేర్కొంది.
ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం ఈ భూములను క్రమబద్ధీకరించాలని నిర్ణయించింది. అయితే దీనికి గతంలో అనుసరించిన విధానాన్నే అమలు చేయాలా.. లేక మరే విధంగా ముందుకు సాగాలా? అన్న దానిపై ప్రస్తుతం కసరత్తు చేస్తున్నారు. అలాగే అర్బన్ల్యాండ్ సీలింగ్ భూములను కొనుగోలు చేసిన వారికి కూడా ఆ భూములను క్రమబద్ధీకరించే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములను ఇప్పటికిప్పుడు విక్రయించడం వల్ల ఆశించిన మేరకు ఆదాయం సమకూరదనే అభిప్రాయంలో అధికారులు కూడా ఉన్నారు. హుడాకు అప్పగించిన భూములను కూడా విక్రయించాలని నిర్ణయించింది. భూముల విక్రయంలో ఎంత చేసినా రూ.6500 కోట్ల నిధులు ఖజానాకు జమ చేయడం సాధ్యమయ్యేది కాద న్న అభిప్రాయానికి అధికారులు వచ్చారు. అయి తే ఒక ప్రయత్నం చేస్తున్నామని, ఎంతవరకు సఫలీకృతం అవుతామన్నది చూడాల్సిన అవసరం ఉందని ఓ అధికారి వ్యాఖ్యానించారు.