సాక్షి, రంగారెడ్డి జిల్లా: అబ్దుల్లాపూర్ మెట్ మండలం మునగనూరు సర్వే నంబర్ 44లోని రూ.200 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంపై జిల్లా రెవెన్యూ యంత్రాంగం స్పందించింది. ‘పత్రాలు సృష్టించారు..పట్టా చేశారు’ శీర్షికతో మంగళవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం ఇటు రెవెన్యూ వర్గాల్లోనూ, అటు అధికార పార్టీ నేతల్లోనూ చర్చనీయాంశంగా మారింది.
జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశాల మేరకు ఇబ్రహీంపట్నం ఆర్డీఓ శ్రీనివాసరెడ్డి, అబ్దుల్లాపూర్మెట్ తహశీల్దార్ సుదర్శన్రెడ్డిలు క్షేత్రస్థాయిలో పర్యటించారు. అన్యాక్రాంతమైన భూములను పరిశీలించారు. కాగా రికార్డులను పరిశీలించి, సమగ్ర నివేదికను అందజేయాల్సిందిగా తహశీల్దార్ను కలెక్టర్ ఆదేశించారు. ఒకటీ రెండు రోజుల్లో ప్రభుత్వానికి ఈ భూములపై నివేదిక అందే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
భూకబ్జాలపై పోరాటం: మంచిరెడ్డి
మునగనూరు భూ కబ్జాలపై పోరాటానికి శ్రీకారం చుట్టినట్లు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అబ్దుల్లాపూర్మెట్లో అధికార పార్టీ అరాచకం రోజురోజుకు మరింత పెరిగిపోతోందని, 12 ఎకరాల ప్రభుత్వ భూమిని అధికార పార్టీ నేతలు చెరబట్టారని, ఖాస్త్రా, చెస్సాల పహాణిల్లో సర్కారుగా ఉన్న భూమి.. ప్రస్తుతం పట్టా భూమిగా ఎలా రూపాంతరం చెందిందని ప్రశ్నించారు.
తాజాగా మరికొంత భూమి ఆక్రమణకు పాల్పడుతున్నారని ఆరోపించారు.కాగా మునగనూరు కేంద్రంగా వెలుగు చూసిన ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంపై, ఈ భారీ భూకుంభకోణం వెనుక ప్రభుత్వ పెద్దల హస్తంపై సమగ్ర విచారణ జరపాలని ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్ నాయకుడు సత్తు వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు.


