90కి చేరిన టీఆర్‌ఎస్‌ బలం | Rebel MLAS Korukanti Chander And Ramulu Naik To Join IN TRS | Sakshi
Sakshi News home page

కారెక్కిన ఇండిపెండెంట్లు

Dec 13 2018 3:16 AM | Updated on Dec 13 2018 3:16 AM

Rebel MLAS Korukanti Chander And Ramulu Naik To Join IN TRS - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరారు. రామగుండం ఎమ్మెల్యే కోరుకుంటి చందర్, వైరా ఎమ్మెల్యే లావుడ్య రాములు నాయక్‌ బుధవారం కేటీఆర్‌ను కలిసి టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. టీఆర్‌ఎస్‌ టికెట్‌ దక్కకపోవడంతో కోరుకంటి చందర్‌ రామగుండంలో ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ తరఫున పోటీ చేసి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోమారపు సత్యనారాయణపై గెలిచారు.

2009లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన సోమారపు టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన కోరుకుంటి చందర్‌పై గెలుపొందారు. అనంతరం సత్యనారాయణ టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇప్పుడు కోరుకంటి చందర్‌ విషయంలోనూ ఇదే జరిగింది. వైరా నుంచి కాంగ్రెస్‌ టికెట్‌ దక్కపోవడంతో రాములు నాయక్‌ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. అసెంబ్లీ రద్దుకు ముందు టీఆర్‌ఎస్‌ పార్టీకి 90 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ముందస్తు ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 88 స్థానాల్లో విజయం సాధించింది. ఇప్పుడు ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకోవడంతో ఎమ్మెల్యేల సంఖ్య 90కి చేరింది. 

కేసీఆర్‌ మా నాయకుడు: చందర్‌ 
‘ఉద్యమ సమయంలో కాంగ్రెస్‌ పీడీ యాక్టులతో ఇబ్బంది పెట్టిన వెనకడుగు వేయలేదు. నాటి నుంచి నేటి వరకు మా నాయకుడు కేసీఆరే.. నాకు రాజకీయ జన్మనిచ్చింది కేసీఆరే. నిరుద్యోగ వ్యవస్థను నిర్మూలించడమే లక్ష్యంగా పనిచేస్తున్న కేటీఆర్‌ను కలిసి నా మద్దతు తెలిపా. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తా’అని చందర్‌ అన్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement