
250 అడుగుల పతాకంతో ర్యాలీ
జాతీయ పతాక ఆవిష్కరణ దినోత్సవం (జూలై 22) పురస్కరించుకుని హన్మకొండ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ పతాక ర్యాలీని కలెక్టర్ జి.కిషన్ ముఖ్యఅతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు.
హన్మకొండ అర్బన్ : జాతీయ పతాక ఆవిష్కరణ దినోత్సవం (జూలై 22) పురస్కరించుకుని హన్మకొండ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ పతాక ర్యాలీని కలెక్టర్ జి.కిషన్ ముఖ్యఅతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ పతాకం ఎన్ని మార్పులకు లోనై చివరకు ప్రస్తుత రూపం 1947 సంవత్సరం 22 జూలైలో రూపొందిందన్నారు.
పింగళి వెంకయ్య జాతీయ పతాక రూపకర్త అని తెలిపారు. కలెక్టరేట్ నుంచి సుమారు వెయ్యి మంది విద్యార్థులు 250 అడుగుల పొడవున్న జాతీయ పతాకంతో పబ్లిక్ గార్డెన్ వరకు ర్యాలీ తీశారు. పబ్లిక్గార్డెన్ వద్ద జరిగిన ముగింపు సమావేశంలో ఓఎస్డీ అంబర్ కిషోర్ పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో విజేతలకు ఆయన బహుమతులు అందజేశారు.
కార్యక్రమంలో పాల్గొన్న రోటరీ అధ్యక్షుడు కాయిత ఇంద్రసేనారెడ్డి, కార్యదర్శి రవీంద్రనాథ్ మాట్లాడుతూ విద్యార్థులకు స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాలు క్లబ్ ద్వారా చేపడుతున్నామని తెలిపారు. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు కాపాడాలని లక్ష్యంతో ఈ విధమైన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో డీఆర్వో సురేంద్రకరణ్, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్యయ నవీన్, ఉద్యోగ సంఘాల నాయకుడు దారం జనార్దన్, మనోహర్రెడ్డి, సతీష్కుమార్, రాజిరెడ్డి, పురుషోత్తం, మధుకర్, రాఘవులు, సుధీర్కుమార్, సురేందర్రావు, పలు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.