ఊరపందుల దాడిలో బాలుడి మృతి
సాక్షి, హైదరాబాద్(మలక్పేట) : ఇంటి ముందు ఆడుకుంటున్న హర్షవర్ధన్(3) అనే బాలుడిపై ఊరపందులు దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన మంగళవారం హైదరాబాద్లోని సైదాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కూలి పనిచేసుకునే కేశ్యానాయక్కు కుమార్తె, కుమారుడు. కుటుంబంతో కలిసి హైదరాబాద్లో ఐఎస్ సదన్ డివిజన్ సింగరేణి కాలనీలోని గుడిసెలో నివాసం ఉంటున్నాడు.
మంగళవారం సాయంత్రం కేశ్యానాయక్ మూడేళ్ల కుమారుడు హర్షవర్ధన్ గుడిసె ముందు ఆడుకుంటుండగా అటుగా వచ్చిన ఊరపందులు బాలుడిపై దాడి చేశాయి. గుడిసెలో ఉన్న తల్లిదండ్రులు బయటికి వచ్చేసరికి పందులు బాలుని నోట కరుచుకుని తీసుకెళ్తుండగా స్థానికులు వాటి వెంటపడటంతో విడిచి పెట్టి పారిపోయాయి. పందుల దాడిలో బాలుడికి తీవ్రగాయాలవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.