పీహెచ్‌‘డీ’లా 

PHD admissions in osmania university - Sakshi

ఓయూలో విచిత్రం   

గడువు ముగిసినా పరిశోధనా పత్రాలు  సమర్పించని అభ్యర్థులు 

ఫెలోషిప్‌లపై తీవ్ర ప్రభావం చూపుతున్న వైనం 

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీలు డీలా పడుతున్నాయి. అడ్మిషన్‌ పొందిన వారిలో సగం మంది కూడా సకాలంలో పరిశోధన పత్రాలు సమర్పించడం లేదు. ప్రత్యక్షంగా వర్సిటీకి చెడ్డపేరు తేవడంతో పాటు పరోక్షంగా ఇది వివిధ ఫెలోషిప్‌లపై ప్రభావం చూçపుతోంది. అడ్మిషన్‌ పొందుతున్న ప్రతి పది మందిలో ఒకరిద్దరు మాత్రమే నిర్దేశిత గడువులోగా థీసిస్‌ సమర్పిస్తుండగా, 80 శాతం మంది గడువు ముగిసిన తర్వాతే అందజేస్తున్నారు. పరోక్షంగా ఇది వర్సిటీకి చెడ్డ పేరు తీసుకురావడంతో పాటు పరిశోధనలు, ఫెలోషిప్‌లపై తీవ్రప్రభావం చూపుతోంది. 

సాక్షి, హైదరాబాద్‌ : పీహెచ్‌డీ చేయడం ఒకప్పుడు చాలా గొప్పగా భావించేవారు. వీరికి దేశవిదేశాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. కానీ ప్రస్తుతం అభ్యర్థుల ఆలోచన విధానంలో మార్పు వచ్చింది. కేవలం ఫెలోషిప్‌లు సహా హాస్టల్‌ వసతి కోసమే పీహెచ్‌డీ అడ్మిషన్‌ అన్నట్లుగా తయారైంది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ అడ్మిషన్‌ పొందిన వారిలో సగం మందికి కూడా పరిశోధన పత్రాలు సమర్పించడం లేదు. మరికొంత మంది ఐదేళ్లలో పూర్తి చేయాల్సిన పీహెచ్‌డీ కోర్సును ఏడెనిమిదేళ్ల వరకు పొడిగించుకుంటున్నారు. పీహెచ్‌డీ అడ్మిషన్‌ దొరికితే చాలు ప్రభుత్వ ఉద్యోగం వచ్చే వరకు హాస్టల్లో ఉచితంగా వసతి పొందడంతో పాటు ప్రైవేటుగా ఏదో ఒక ఉద్యోగం చేసుకోవచ్చని భావిస్తుంటారు చాలా మంది. అందుకే ఏ కోర్సుకు లేనంత డిమాండ్‌ పీహెచ్‌డీకి ఉంది. నోటిఫికేషన్‌ జారీ మొదలు ప్రవేశాల ముగింపు వరకు ఎన్నో ఆరోపణలు.. పోరాటాలు... తీరా సీటు లభిస్తే కనీసం 30 శాతం మంది కూడా ఇచ్చిన గడువులోపు పరిశోధన పత్రాలు పూర్తి చేయడం లేదు.

పీహెచ్‌డీలో చేరిన ఒక్కో సైన్స్‌ విద్యార్థికి నెలకు రూ. లక్షకుపైనే ఖర్చు అవుతోంది. జాతీయ స్థాయిలో నిర్వహించే నెట్‌లో ప్రతిభ చూపిన వారికి జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోషిప్‌(జేఆర్‌ఎఫ్‌)కింద ఉపకారవేతనం అందిస్తుంది. పీజీలో సాధించిన మార్కుల ఆధారంగా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రాజీవ్‌ గాంధీ నేషనల్‌ ఫెలోషిప్‌లు అందిస్తుంది. గతంలో ఓయూకి ఏటా 60–70 రాజీవ్‌గాంధీ ఫెలోషిప్‌లు వస్తే ప్రస్తుతం 30–40కి మించడం లేదు. పీహెచ్‌డీ అడ్మిషన్‌ పొందిన వారిలో చాలా మంది మధ్యలో మానేస్తుండటం, సకాలంలో పరిశోధనలు పూర్తి చేసి ధీసిస్‌ సమర్పించక పోవడం వల్లే ఈ ఫెలోషిప్‌ల కుదింపుకు కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.   

ప్రీ పీహెచ్‌డీలో 30 శాతం మంది
పీహెచ్‌డీ ప్రవేశాల తర్వాత ఏడాది లోపు ప్రీపీహెచ్‌డీ పరీక్ష నిర్వహిస్తారు. దీంట్లో రెండు సబ్జెక్టులు ఉంటాయి. వీటిలో 50 శాతం మార్కులు రావాలి. అభ్య ర్థిలో పరిశోధనాంశంపై ఏ మేరకు అవగాహాన పెరిగిందో ఈ పరీక్ష ద్వారా తెలుస్తుంది. అయితే ప్రీపీహెచ్‌డీ పరీక్షలో 30 శాతం మంది తప్పుతున్నట్లు విమర్శలు లేకపోలేదు. గతంలో రెగ్యులర్‌ పీహెచ్‌డీ కోర్సు మూడేళ్లు, పార్ట్‌టైమ్‌ కోర్సు నాలుగేళ్లు ఉండేది. ఆ తర్వాత మూడేళ్ల కోర్సును నాలుగేళ్లకు, నాలుగేళ్ల కోర్సును ఐదేళ్లకు పెంచారు. పీహెచ్‌డీ అడ్మిషన్‌ పొంది నిర్ధేశిత గడువులో పరిశోధన పత్రాలు సమర్పించిన వారు 40 శాతం మించలేదు. అధిక శాతం 6– 10 ఏళ్ల లోపు పూర్తి చేస్తున్నవారే. పీహెచ్‌డీలో చేరిన ఆర్ట్స్, సైన్స్‌ కోర్సు విద్యార్థుల్లో 50 శాతం మంది మధ్యలోనే మానేస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.   

గతేడాది పీహెచ్‌డీ కోర్సుల్లో రిజిస్టరైన వారు

ఫ్యాకల్టీ                               రిజిస్టరైన 
పేరు                                  అభ్యర్థులు 

ఆర్ట్స్‌                                    564 
కామర్స్‌                                218 
ఎడ్యుకేషన్‌                             76 
ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ      142 
లా                                         2 
మేనేజ్‌మెంట్‌                         367 
ఓరియంటల్‌ లాంగ్వేజ్‌                5 
సైన్స్‌                                   1191 
సోషల్‌ సైన్స్‌                          443 
ఫార్మసీ                                 31 
గత విద్యా సంవత్సరం పూర్తి అయినవి 
సైన్స్‌                                 181 
ఇంజనీరింగ్‌                         48 
ఇతరులు                           137 
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top