‘పాలమూరు’ పూర్తికి రూ. 35 వేల కోట్లు! | 'Palamuru' completion of the Rs. 35 thousand crores! | Sakshi
Sakshi News home page

‘పాలమూరు’ పూర్తికి రూ. 35 వేల కోట్లు!

Mar 23 2015 12:49 AM | Updated on Sep 2 2017 11:14 PM

‘పాలమూరు’ పూర్తికి రూ. 35 వేల కోట్లు!

‘పాలమూరు’ పూర్తికి రూ. 35 వేల కోట్లు!

రాష్ట్ర ప్రభుత్వం త్వరలో శంకుస్థాపన చేయనున్న పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి నిర్మాణ వ్యయం భారీగానే ఉండనున్నట్లు తెలుస్తోంది.

  • ప్రాజెక్టు నిర్మాణానికిభారీ స్థాయిలో కానున్న వ్యయం
  • రెండు, మూడో దశ సర్వే అనంతరం ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ అంచనా
  • నాలుగైదు రోజుల్లో ప్రభుత్వానికి సమగ్ర నివేదిక
  • సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం త్వరలో శంకుస్థాపన చేయనున్న పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి నిర్మాణ వ్యయం భారీగానే ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ  ప్రాజెక్టుకు మొత్తంగా రూ. 32 వేల కోట్ల నుంచి రూ. 35 వేల కోట్లు అవసరం ఉంటుందని రెండు, మూడో దశ సర్వే పూర్తి చేసిన అనంతరం ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ అంచనాకు వచ్చింది. మొదటి దశకు రూ. 15,850 కోట్ల మేర అవసరమని తేల్చిన సంస్థ, రెండు, మూడు దశలకు రూ. 20 వేల కోట్లు అవసరమని లెక్కగట్టినట్లు తెలిసింది.

    అదే నిజమైతే రాష్ట్రంలో రూ.38,500 కోట్లతో చేపట్టిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు తర్వాత ప్రభుత్వం చేపట్టే భారీప్రాజెక్టు ఇదే. జూరాల నుంచి 70 టీఎంసీల నీటిని తరలించేందుకు మహబూబ్‌నగర్ నుంచి రంగారెడ్డి మీదుగా నల్లగొండ వరకు నీటిని తరలించి సుమారు 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని పాలమూరు ఎత్తిపోతలను ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది. ఈ మొత్తం ప్రాజెక్టులో 3 భారీ రిజర్వాయర్లు నిర్మించాల్సి ఉంటుందని  తేల్చారు.

    ఇందులో తొలి దశ రిజర్వాయర్ అయిన కోయిల్‌కొండ వరకు జూరాల నుంచి నీటిని ఎత్తిపోసి తరలించేందుకు 3 కిలోమీటర్ల ఓపెన్‌చానల్, మరో 25 కిలోమీటర్ల మేర టన్నెల్ తవ్వా ల్సి ఉంటుందని గుర్తించారు. దాంతోపాటే పంపింగ్ స్టేషన్ వద్ద 160 మెగావాట్ల సామర్థ్యంగల 14 పంపులు అవసరమని పేర్కొన్నారు. ఈ దశ నిధులకు త్వరలోనే  అనుమతులు మంజూరు చేసి ఏప్రిల్ తొలి వారంలో శంకుస్థాపన చేయాలని సీఎం నిర్ణయించారు. రెండో రిజర్వాయర్‌ను రంగారెడ్డి జిల్లా గండేడు వద్ద 45 టీఎంసీల నిల్వ సామర్ధ్యంతో నిర్మించాలని ప్రతిపాదించారు.

    రిజర్వాయర్ నుంచి 2 ప్రధాన కాలువల కింద మొత్తంగా 5.2 లక్షల ఎకరాలకు నీరందించాలని నిర్ణయించారు. ఇక్కడి పంపింగ్ స్టేషన్ వద్ద 160 మెగావాట్ల సామర్థ్యంగల 5 పంపులను ప్రతిపాదించారు. రిజర్వాయర్ కింద 8 గ్రామాలు,12,283 ఎకరాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందని తేల్చారు. రంగారెడ్డి జిల్లాలోని లక్ష్మీదేవునిపల్లిలో 10 టీఎంసీల సామర్థ్యంతో మూడో రిజర్వాయర్‌ను ప్రతిపాదించారు.

    దీని నుంచి 3 ప్రధాన కాలువలను ప్రతిపాదించిన సర్వే సంస్థ, సుమారు 4.05 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించవచ్చని పేర్కొన్నారు. ఇక్కడ 70 మెగావాట్ల సామర్థ్యంగల 4 పంపులను ప్రతిపాదించారు. దీని కింద 2 గ్రామాలు, 4,100 ఎకరాల భూమి ముంపునకు గురవుతోంది. మొత్తంగా వి ద్యుత్ అవసరాలు 3,500 మెగావాట్ల వరకు ఉండొచ్చని గుర్తించారు. వీటన్నింటికీ  మొత్తంగా రూ.35 వేల కోట్ల మేర అవసరమని సర్వే సంస్థ తేల్చింది.

    సీడీవో పరిశీలనలో నివేదిక: ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ పూర్తి చేసిన 2, 3 దశ సర్వే నివేదికను ప్ర స్తుతం సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ (సీడీవో) పరిశీలిస్తోంది. ప్రాజెక్టులో మార్పుచేర్పులపై అధ్యయనం చేస్తోంది. తొలి దశ సర్వేనూ ప రిశీలించిన సీడీవో కొన్ని మార్పులు సూచించడంతో సర్వే సంస్థ అంచనా వ్యయం మరో రూ. వెయ్యి కోట్లు పెరిగింది. ప్రస్తుతం సీడీవో ఏవైనా మార్పులు సూచిస్తే అంచనా వ్యయాల్లో హెచ్చుతగ్గులుండే అవకాశం ఉంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement