బిల్లుల చెల్లింపుల్లో ప్రాధాన్యతలేంటి?: మంత్రి ఉత్తమ్‌ | Uttam Kumar Reddy says Sitarama Project to be completed at the earliest | Sakshi
Sakshi News home page

బిల్లుల చెల్లింపుల్లో ప్రాధాన్యతలేంటి?: మంత్రి ఉత్తమ్‌

May 11 2025 4:00 AM | Updated on May 11 2025 4:00 AM

Uttam Kumar Reddy says Sitarama Project to be completed at the earliest

నోట్‌ సమర్పించాలని ఆదేశించిన మంత్రి ఉత్తమ్‌ 

సీతారామ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేస్తామని వెల్లడి 

సమీక్షలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొంగులేటి, తుమ్మల 

సాక్షి, హైదరాబాద్‌: ‘సాగునీటి ప్రాజెక్టుల కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపుల్లో అనుసరిస్తున్న ప్రాధాన్యతలు ఏమిటి? వాటిని సమర్థిస్తూ నోట్‌ సమర్పించండి. సరైన మాధ్యమం ద్వారా ఆర్థిక శాఖ ముందు ఈ విషయాన్ని ఉంచుదాం..’అని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఆ శాఖ అధికారులను ఆదేశించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావుతో కలిసి శనివారం జలసౌధలో సీతారామా ఎత్తిపోతలు–సీతమ్మసాగర్‌ బహుళార్థక సాధక ప్రాజెక్టు నిర్మాణంపై ఆయన సమీక్ష నిర్వహించారు. 

ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. దక్షిణ తెలంగాణ ప్రాంత సాగునీటి అవసరాలు తీర్చడంలో కీలకమైన ఈ ప్రాజెక్టును ఫాస్ట్‌ ట్రాక్‌ విధానంలో పూర్తి చేస్తామన్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉండిపోయిన ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తైతే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌ జిల్లాల్లో 7.80 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. 

నీటి కేటాయింపులు పొందడంలో గత సర్కారు ఫెయిల్‌.. 
సీతారామ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు పొందడంలో గత ప్రభుత్వం విఫలమైందని మంత్రి ఉత్తమ్‌ విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక 16 నెలల్లోనే కేంద్రాన్ని, కేంద్ర జలసంఘాన్ని ఒప్పించి 67 టీఎంసీల గోదావరి జలాల కేటాయింపులను సాధించామని అన్నారు. సీతారామ ప్రాజెక్టు ప్రధాన కాల్వ పనులు 97 శాతం పూర్తయ్యాయని, మూడు ప్రధాన పంప్‌హౌస్‌లలో ఇప్పటికే వెట్‌రన్‌ను విజయవంతంగా నిర్వహించామని పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా అధికారులు వివరించారు. త్వరలో నాలుగో పంప్‌హౌస్‌ పనులూ పూర్తి చేస్తామన్నారు. 

పాలేరు లింక్‌ కాల్వ, సత్తుపల్లి ట్రంక్‌ కెనాల్, ఎంకూరు లింక్‌ కాల్వ పనులు పురోగతిలో ఉన్నాయని వివరించారు. భూసేకరణ, అటవీ అనుమతులు, సొరంగాల వద్ద కట్టడాల నిర్మాణంలో సమస్యలతో పనుల్లో జాప్యం జరుగుతోందన్నారు. ‘పనులు చేసేందుకు వేసవి అనువైన సమయం. అడ్డంకులున్నా వేగంగా పనులు కొనసాగించండి. ఇక ఏమాత్రం జాప్యాన్ని భరించలేం. ప్రతి రోజూ క్షేత్ర స్థాయిలో ఉంటూ భూసేకరణ, అటవీ అనుమతులను వేగవంతం చేయాలి.’అని అధికారులను మంత్రి ఆదేశించారు. 

భూసేకరణకు అవసరమైన మొత్తం నిధులు ఎంత? ఎంత పురోగతి సాధించారు? అడ్డంకులు ఏం ఉన్నాయి? తెలపాలని కోరారు. భూసేకరణపై సమగ్ర సమాచారం అందించాలని ఆదేశించారు. సరిగ్గా నెల రోజుల తర్వాత మళ్లీ సమీక్ష నిర్వహించి పురోగతిని పరిశీలిస్తామన్నారు. పర్యావరణ, అటవీ అనుమతుల్లేకుండానే గత ప్రభుత్వం సీతమ్మసాగర్‌ ప్రాజెక్టు పనులు చేయడంతో ఎన్జీటీ విధించిన రూ.53.41 కోట్ల జరిమానాను రద్దు చేయించడానికి కృషి చేస్తున్నామని ఉత్తమ్‌ తెలిపారు. ప్రాజెక్టుకు అవసరమైన అన్ని అనుమతులూ త్వరలో తీసుకొస్తామన్నారు.  

ఇల్లెందుకు సీతారామ జలాలు 
ఈ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితుడిగా ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య హాజరై తన నియోజకవర్గానికి సైతం ప్రాజెక్టు ద్వారా నీళ్లు అందించాలని విజ్ఞప్తి చేయగా, మంత్రి ఉత్తమ్‌ సానుకూలంగా స్పందించారు. ప్రస్తుత ప్రాజెక్టు డిజైన్‌కు ఎలాంటి మార్పులు చేయకుండానే ఇల్లెందుకు సాగునీటి సరఫరాకు ఉన్న సాంకేతిక సాధ్యాసాధ్యాలపై పరిశీలన జరపాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రాన్ని ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలు శాసిస్తున్నారని ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌ సరదాగా వ్యాఖ్యానించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement