భార్య ప్రయాణిస్తున్న బస్సు ఢీకొని భర్త మృతి

భార్య ప్రయాణిస్తున్న బస్సు ఢీకొని భర్త మృతి - Sakshi


►రెండు బైక్‌లు ఢీ: రోడ్డుపై పడిపోయిన వ్యక్తి...

►ఆయన పైనుంచి బస్సు వెళ్లడంతో దుర్మరణం 

►తండ్రి మృతి...కూతుళ్లకు తీవ్రగాయాలు




ఇబ్రహీంపట్నం : ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్‌లు ఢీకొన్నాయి. ఓ వ్యక్తి రోడ్డుపై పడిపోయాడు. అతడి పైనుంచి బస్సు వెళ్లడంతో దుర్మరణం చెందాడు. ప్రమాదంలో తండ్రి దుర్మరణం చెందగా, కుమార్తెలిద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన సోమవారం రాత్రి 7:30 గంటల సమయంలో ఇబ్రహీంపట్నం మండల పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కందుకూరు మండలం ఉట్లపల్లి గ్రామానికి చెందిన బుర్ర జగన్(35) సోమవారం రాత్రి తన కుమార్తెలు స్వీటీ(11), క్రేజీ(3)లతో కలిసి బైక్(29 బీజీ 5802)పై యాచారం వస్తున్నాడు.



ఆయన భార్య వెనుక నుంచి బస్సులో వస్తోంది. మంచాల మండలం లోయపల్లికి మల్లేష్ ఎదురుగా వస్తున్నాడు. ఈక్రమంలో ఖానాపూర్ స్టేజీ సమీపంలో వీరి రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో బైక్‌పైనుంచి రోడ్డుపై పడిపోయిన జగన్ పైకి లేచేందుకు యత్నిస్తున్నాడు. అంతలోనే ఇబ్రహీంపట్నం నుంచి యాచారం వైపు వెళ్తుతున్న ఆర్టీసీ బస్సు(ఏపీ29జడ్2589) ఆయన పైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.



ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన స్వీటీ, క్రేజీ, మల్లేష్‌లను 108 అంబులెన్స్‌లో హైదరాబాద్ తరలించారు. కాగా ప్రమాదానికి కారణమైన బస్సులోనే జగన్ భార్య కూడా ప్రయాణిస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియరాలేదు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top