వ్యవసాయ మార్కెట్లలో టెండర్ల వ్యవహారం గందరగోళంగా మారింది...
- వ్యవసాయ మార్కెట్కు ఖరారుకాని టెండర్లు
- నచ్చిన వారికి కట్టబెడుతున్న అధికారులు
- సైకిల్ స్టాండ్ టెండర్కు ‘పెద్ద’లతో ఒత్తిడి
వరంగల్ సిటీ : వ్యవసాయ మార్కెట్లలో టెండర్ల వ్యవహారం గందరగోళంగా మారింది. వరంగల్ వ్యవసాయ మార్కెట్, దాని అనుబంధ మార్కెట్లలో మార్చి 31వ తేదీతో టెండర్లకు గడువు తీరింది. దీంతో అధికారులు 2015-16 మార్చి వరకు టెండర్ల కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. ఇచ్చిన గడువు ప్రకారం టెండర్ దాఖలు చేసిన కాంట్రాక్టర్ల సమక్షంలోనే షెడ్యూల్డ్ ఫారాలను తెరిచారు. అరుతే మార్కెట్ నిబంధనల ప్రకారం కాకుండా.. తమకు నచ్చిన వారికే అధికారులు టెండర్లు కట్టబెట్టారని టెండర్ దాఖలు చేసిన పలువురు కాంట్రాక్టర్లు ఆరోపించారు.
తేలని సైకిల్ స్టాండ్, మూడు క్యాంటీన్ల వ్యవహారం
ఇప్పటివరకు లక్ష్మీపురం కూరగాయల మార్కెట్ సైకిల్ స్టాండ్, పత్తి, మిర్చి, పల్లి యూర్డులలోని మూడు క్యాంటీన్ల భవితవ్యం తేలడం లేదు. వీటిని కూడా ఎక్కువ డబ్బులు ఎవరు ఇస్తే వారికి కట్టబెట్టే యత్నాలు జోరుగా సాగుతున్నట్లు టెండర్దారులు ఆరోపిస్తున్నారు. సైకిల్ స్టాండ్ విషయమై ఇప్పటికే రెండుసార్లు ‘సాక్షి’ దినపత్రికలో కథనాలు ప్రచురితమైన విషయం విదితమే. దీంతో అధికారులు తమకు నచ్చిన వారికి టెండర్ కట్టబెట్టడానికి సంకోచిస్తున్నారు.పైగా సైకిల్ స్టాండ్ కోసం టెండర్ వేసిన కాంట్రాక్టర్ డిప్యూటీ సీఎం వద్ద నుంచి రెకమండ్ లెటర్ తేవడంతోపాటు మరో ఇద్దరు ప్రజాప్రతినిధులతో తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక పెద్ద మార్కెట్లోని ఓ క్యాంటీన్ టెండర్దారుడు కోర్టుకు వెళ్లారని, అందుకే దాని టెండర్ నిలిపివేస్తున్నట్లు అధికారులు చెబుతున్నా.. అదంతా నిజం కాదని తెలుస్తోంది. కాగా, తమకు నచ్చిన కొన్ని క్యాంటీన్లు, పారిశుధ్య పనులను నచ్చిన వారికి ఇవ్వడానికి మార్కెట్లోని ఓ ఉన్నతాధికారి మొద టి నుంచి పైరవీలు చేస్తూ పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నట్లు మార్కెట్లో ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికైనా మిగిలిపోయిన పనులను టెండర్దారులకు అప్పగించి.. గందరగోళం, మాయాజాలానికి స్వస్తి పలకాలని రైతులు, కార్మికులు, వ్యాపారులు కోరుతున్నారు.