అభిమానలోకం..శోకసంద్రం!

Nandamuri Harikrishna Died In Road Accident - Sakshi

దావానంలా వ్యాపించిన హరికృష్ణ ప్రమాద ఘటన వార్త

భారీగా తరలివచ్చిన అభిమానులు

కిక్కిరిసిపోయిన కామినేని ఆస్పత్రి పరిసర ప్రాంతాలు

సంఘటన జరిగిన అన్నెపర్తి వద్దా వందలాదిగా గుమిగూడిన జనం

సాక్షిప్రతినిధి, నల్లగొండ : తెలతెలవారుతుండగానే నందమూరి అభిమానులు చేదువార్త వినాల్సి వచ్చింది. నల్లగొండ మండల పరిధిలోని అన్నెపర్తి 12వ బెటాలియన్‌ మూల మలుపు వద్ద బుధవారం ఉదయం 5.50 గంట లకు జరిగిన రోడ్డు ప్రమాదంలో టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి,  రాజ్యసభ మాజీ సభ్యుడు, సినీనటుడు నందమూరి హరికృష్ణ(61) తీవ్రం గా గాయపడిన వార్త ఒక్కసారిగా గుప్పుమంది. సమీపంలోని నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినా ప్రయోజనం లేకపోయింది.

ఉదయం 7.15 గంటలకు హరికృష్ణ మృతి చెందినట్లు కామినేని వైద్యులు ప్రకటించడం, ఆవెంటనే టీవీ చానళ్లలో ఆ వార్త ప్రసారం కావడంతో జిల్లాలోని వివిధ ప్రాంతాలనుంచి టీడీపీ కార్యకర్తలు, నందమూరి అభిమానులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి చేరుకున్నారు. రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ మృతి చెందిన వార్త, ప్రమాద ఫొటోలు, వీడియోలు సోషల్‌మీడియాలోనూ విస్తృతంగా ప్రచారం అయ్యాయి. సినీ హీరోలు జూనియర్‌ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌లు ఉదయం 8.30 గంటలకల్లా కామినేనికి చేరుకున్నారన్న వార్త బయటకు రావడంతో వారి అభిమానులు పె ద్ద సంఖ్యలో జాతీయ రహదారిపై పోగయ్యారు. సినీ హీరోలు బాలకృష్ణ, జగపతి బాబు తదితరులూ వచ్చారని తెలుసుకున్న అభిమానులు మ రింత మంది తరలివచ్చారు. ఒక దశలో జనానికి సర్దిచెప్పడం పోలీసులకు కష్టసాధ్యమైంది. 

హరికృష్ణకు నివాళి అర్పించేందుకు, నందమూరి కుటుంబాన్ని పరామర్శించేందుకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వస్తారన్న సమాచారంతో పోలీసులు బారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో కామినేని ఆస్పత్రి ప్రధాన గేటుకు తాళం వేసి లోనికి ఎవరినీ వెళ్లనీయలేదు. దీంతో పెద్ద సంఖ్యలో గుమికూడిన నందమూరి అభిమానులు, టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందు నుంచీ తమతో కలిసి పార్టీలో పనిచేసిన హరికృష్ణను కడసారి చూసేందుకు పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో వచ్చారు.

హరికృష్ణతో ప్రత్యక్ష సంబంధం, అనుబంధం, పరిచయం ఉన్న నేతలు, వారి అనుచరులు రావడంతో కామినేని ఆస్పత్రి ప్రాంతం జనంతో నిండిపోయింది. జాతీయ రహదారిపై కనీసం కిలోమీటరు పొడవునా వాహనాలు నిలిచిపోయాయి. పోస్టుమార్టం పూర్తయ్యాక మధ్యాహ్నం 12.17 గంటలకు హరికృష్ణ మృతదేహాన్ని తరలించాక చాలా సేపటి వరకు కామినేని వద్ద జనం తగ్గలేదు.

తక్షణం స్పందించిన స్థానిక నాయకత్వం

రోడ్డు ప్రమాదానికి గురైన హరికృష్ణ కామినేనిలో చికిత్స పొందుతున్నారని తెలిసిన వెంటనే స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం హుటాహుటిన కామినేనికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. వైద్యులతో మాట్లాడిన వెంటనే సీఎం కేసీఆర్‌కు, జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డికి సమాచారం అందించారు. హరికృష్ణతో ప్రత్యక్ష సంబంధం ఉన్న నల్లగొండ టీఆర్‌ఎస్‌ ఇన్‌ఛార్జి కంచర్ల భూపాల్‌రెడ్డి వెంటనే ఆస్పత్రికి చేరుకున్నారు. నందమూరి కుటుంబంతోనూ ఆ యనకు సంబంధాలు ఉండడంతో ఆస్పత్రికి వ చ్చిన కుటుంబ సభ్యులందరినీ ఆయనే లోపలికి తీసుకెళ్లి వెంట ఉన్నారు.

రాష్ట్ర టీడీపీ నాయకులూ కామినేనికి వచ్చారు. జిల్లాకు చెందిన వివిధ పా ర్టీల నేతలు సైతం హాస్పిటల్‌కు వచ్చినా చాలా మందిలోనికి వెళ్లలేక పోయారు. జిల్లా కేంద్రానికి సమీపంలో ప్రమాదం జరగడంతో నల్లగొండ ప ట్టణం నుంచి యువకులు పెద్ద సంఖ్యలో సంఘట నా స్థలికి, అటు నుంచి కామినేనికి చేరుకున్నారు.

ప్రమాదకరంగా రోడ్డు మలుపు 

బెటాలియన్‌ నుంచి అన్నెపర్తి స్టేజి వరకు అర కిలోమీటరు దూరం ‘ఎస్‌’ ఆకారంలో ప్రమాదకరంగా మూలమలుపు ఉంది.  కల్వర్టు వద్ద మూలమలుపు ఉండడంతో ప్రమాద హెచ్చరికగా కాంక్రీ టు నింపిన పీవీసీ పైపులను రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటు చేశారు.  కల్వర్టును, మూలమలుపును విస్తరించాల్సి ఉంది. 10రోజుల క్రితమే రోడ్డు ప్ర మాదంలో అన్నెపర్తిలో పెళ్లికి వచ్చి తిరిగి వెళ్తున్న అల్గుబెల్లి సత్తిరెడ్డి మృతి చెందాడు. ఈ ప్రాంతంలో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి.

సంఘటన స్థలాన్ని సందర్శించిన ఎస్పీ

అన్నెపర్తి వద్ద ఘటన స్థలాన్ని నల్లగొండ జిల్లా ఎస్పీ రంగనాథ్‌ సందర్శించారు. ప్రమాద వివరా లపై అక్కడున్న వారిని అడిగి తెలుసుకున్నారు. వాహనదారులు తప్పనిసరిగా సీట్‌ బెల్ట్‌ ధరించాలని కోరారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top