మరో 34 గోదాములకు నాబార్డు నిధులు | NABARD funds for another 34 waders | Sakshi
Sakshi News home page

మరో 34 గోదాములకు నాబార్డు నిధులు

May 20 2017 2:43 AM | Updated on Sep 5 2017 11:31 AM

మరో 34 గోదాములకు నాబార్డు నిధులు

మరో 34 గోదాములకు నాబార్డు నిధులు

రాష్ట్రంలో కొత్తగా మరో 34 గోదాములకు నాబార్డు నిధులు మంజూరు అయ్యాయని మార్కెటింగ్‌ మంత్రి హరీశ్‌రావు తెలిపారు.

► ఇందుకోసం రూ.73.50 కోట్లు మంజూరు
► ధాన్యం సేకరణ, గోదాములపై మంత్రి హరీశ్‌రావు సమీక్ష


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా మరో 34 గోదాములకు నాబార్డు నిధులు మంజూరు అయ్యాయని మార్కెటింగ్‌ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. శుక్రవారం ఆయన ధాన్యం సేకరణ, గోదాములు, పండ్ల మార్కెట్లు తదితర అంశాలపై సమీక్ష జరిపారు. మార్కెటింగ్‌ శాఖ ఆధ్వర్యంలో 330 గోదాముల నిర్మాణానికి రూ.1,024 కోట్లు గతంలో నాబార్డు మంజూరు చేసిందని, వీటిలో 321 గోదాముల నిర్మాణం చేపట్టామని చెప్పారు. వీటికి టెండర్లు 20 శాతానికిపైగా లెస్‌కు దాఖలయ్యాయని, దీంతో మిగిలిన నిధులతో పాటు మరికొన్ని నిధులివ్వాలని నాబార్డును మార్కెటింగ్‌ శాఖ కోరిందని తెలిపారు.

1.22 లక్షల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యంతో అదనంగా 34 గోదాములను నిర్మించేందుకు నాబార్డు రూ.73.50 కోట్లు మంజూరు చేసిందన్నారు. 300 గోదాముల నిర్మాణం పూర్తైనట్టు అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. మిగతా 21 గోదాములను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని మంత్రి వారిని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 11 కోల్డ్‌ స్టోరేజ్‌ల నిర్మాణ పనుల పురోగతిని కూడా మంత్రి సమీక్షించారు. దేవరకొం డలోని దొండకాయల మార్కెట్, పటాన్‌చెరువులో ఉల్లిగడ్డ మార్కెట్‌ ఇతర పండ్ల మార్కెట్లు 3 నెలల్లో అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. గడ్డి అన్నారం మార్కెట్‌ కోహెడకు తరలింపు.. ఖమ్మం మిర్చి మార్కెట్‌ను రఘునాథపాలెం తరలించే ప్రయత్నాలను మంత్రి సమీక్షించారు.

కాగా, జిల్లాలవారీగా నిర్మల్‌లో 2 గోదాములు, సిరిసిల్లలో 1, కామారెడ్డిలో 4, భద్రాద్రి కొత్తగూడెంలో 2, జగిత్యాలలో 2, కరీంనగర్‌లో 2, జయశంకర్‌ భూపాలపల్లిలో 2, ఖమ్మంలో 1, నల్లగొండలో 2, సూర్యాపేటలో 6, శంషాబాద్‌లో 2, మహబూబ్‌నగర్‌లో 6, నిజామాబాద్‌ జిల్లాలో 2 గోదాములను అదనంగా నిర్మించాలని మార్కెటింగ్‌ శాఖ సంకల్పించిందన్నారు. టెండర్లలో పారదర్శకత వల్ల రూ.150 కోట్లు మిగిలిందని, ఇందులో రూ.75 కోట్లతో వేబ్రిడ్జి, కాంపౌండ్‌ గోడల నిర్మాణాలు, కార్యాలయ భవనాలు, విద్యుత్‌ వసతి కల్పించామని మంత్రి చెప్పారు. మిగిలిన రూ.75 కోట్లతో అదనంగా 34 గోదాములు నిర్మించేందుకు నాబార్డు అనుమతి లభించిందన్నారు. సమీక్షలో మార్కెటింగ్‌ శాఖ డైరెక్టర్‌ లక్ష్మీబాయి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement