సర్దార్ వల్లబాయ్ పటేల్ విగ్రహానికి, ఇతరత్ర నిర్మాణాలకు రూ.200కోట్లు కేటాయించిన ప్రధాని నరేంద్రమోడీ మహిళల భద్రత కోసం కేవలం రూ.100 కోట్లు మాత్రమే కేటాయించారు..
మహబూబాబాద్ : సర్దార్ వల్లబాయ్ పటేల్ విగ్రహానికి, ఇతరత్ర నిర్మాణాలకు రూ.200కోట్లు కేటాయించిన ప్రధాని నరేంద్రమోడీ మహిళల భద్రత కోసం కేవలం రూ.100 కోట్లు మాత్రమే కేటాయించారు.. మహిళలపై ఆయనకున్న అభిమానం ఏపాటిదో బడ్జెట్తోనే బయటపడిందని పీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు వి.సంధ్య విమర్శించారు.
498ఎ చట్టం అమలుపై సోమవారం పీఓడబ్ల్యూ మానుకో ట శాఖ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో చర్చాగోష్టి నిర్వహించారు. జిల్లా కార్యదర్శి బొమ్మెరబోయిన అనసూయ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమం లో సంధ్య మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినా మహిళల సమస్యలను పట్టించుకునే వారే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్భయ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయకపోవడం వల్లే లైంగిక దాడులు జరుగుతున్నాయని, దాడులను అన్యాయాలను ఎదుర్కోవడానికి సామూహికం గా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. పురుషులతో సమానంగా మహిళలకు హక్కు కల్పించాలన్నదే హిందు కోడ్ ఉద్దేశమని చెప్పారు.
ఇందిరాగాంధీ సమయంలోనూ ఏనాడూ మహిళా చట్టాలపై, వారి సమస్యలపై స్పందిం చి న దాఖలాలు లేవన్నారు. వరకట్న నిషేధ చట్టం, ఇతరత్రా వాటిని పోరాటాల ద్వారానే సాధించుకోగలిగామని పేర్కొన్నారు. పాలకులు 498ఎ చట్టానికి తూట్లు పొడుతున్నారని, కుటుంబ సభ్యుల నుంచి రక్షణ కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ చట్టం వచ్చిందని చెప్పారు. ఆ చట్టం పటిష్టంగా అమలు కావడానికి మహిళలు ఉద్యమించాలని కోరారు. కార్యక్రమంలో పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు నర్సక్క, రాష్ట్ర నాయకురాలు నిర్మల, నాయకులు మండల వెంకన్న, బోగ రవిచంద్ర, సామ పాపన్న, తాజ్పాషా, పాఠశాల హెచ్ఎం మరియమ్మ, తదితరులు పాల్గొన్నారు.