ఆహ్లాదం.. ఆలస్యం

Mini Tankbund Works Delay In Medak - Sakshi

పనులు పూర్తయ్యేదెప్పుడు..సరదాగా గడిపేదెన్నడు..?

జిల్లాలో పూర్తి కాని మినీ ట్యాంక్‌బండ్‌లు

మెదక్‌లో కొనసా..గుతున్న పనులు

తూప్రాన్‌లో 80 శాతం పూర్తి

కౌడిపల్లిలో బ్యూటిఫికేషన్‌ పనులు పెండింగ్‌

ట్యాంక్‌బండ్‌ యోగం ఇంకెన్నాళ్లకంటున్న ప్రజలు

ప్రజల ఆహ్లాదం కోసం చేపట్టిన మినీ ట్యాంక్‌ బండ్‌ల పనులు జిల్లాలో ఇంకా పూర్తి కాలేదు. హైదరాబాద్‌లోని ట్యాంక్‌ బండ్‌ తరహాలో తమ ప్రాంతంలో మినీ ట్యాంక్‌ బండ్‌లు తీర్చిదిద్దుతారని అనుకున్న ప్రజల ఆశ తీరడం లేదు. జిల్లా కేంద్రమైన మెదక్‌లో ప్రజలు ఆహ్లాదం కోసం బయటకు వెళ్లేందుకు కనీసం పార్క్‌ అయినా లేదు. ఈ క్రమంలో గోసముద్రం చెరువు కట్టను మినీ ట్యాంక్‌బండ్‌ తరహాలో తీర్చిదిద్దుతారని జనం ఎంతో ఆశపడ్డారు. అయితే 2016 నుంచి మినీ ట్యాంక్‌బండ్‌ పట్టణ ప్రజలను ఊరిస్తూనే ఉంది. పనులు ఎంతకీ పూర్తి కావడం లేదు. రూ.9.52 కోట్లతో గోసముద్రం చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా మలిచే పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో మెదక్‌ పట్టణ ప్రజల్లో అసంతృప్తి వ్యక్తం  అవుతోంది.

సాక్షి, మెదక్‌ : తూప్రాన్‌లో పెద్ద చెరువు, కౌడిపల్లిలోని పెద్ద చెరువులను మినీ ట్యాంక్‌బండ్‌లుగా తీర్చిదిద్దుతున్నారు. అయితే రెండు చోట్లా ఇంకా పూర్తిస్థాయిలో పనులు జరగలేదు. తూప్రాన్‌లోని పెద్ద చెరువును రూ.5.77కోట్లతో మినీ ట్యాంక్‌ బండ్‌గా అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పటి వరకు 80 శాతం పనులు పూర్తయ్యాయి. నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి సొంత గ్రామమైన కౌడిపల్లిలోని పెద్ద చెరువును రూ.4.48 కోట్లతో మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేస్తున్నారు. అధికారుల నివేదికల ప్రకారం ఇక్కడ పనులు పూర్తయ్యాయని చెబుతున్నా ఇంకా బ్యూటిఫికేషన్, ఇతర సివిల్‌ పనులు పూర్తి కావాల్సి ఉంది. మెదక్, కౌడిపల్లి, తూప్రాన్‌లో మినీ ట్యాంక్‌బండ్‌ పనులు ఇంకా పూర్తి కాకపోవడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

మెదక్‌లో కొనసా..గుతున్న పనులు
మెదక్‌ ప్రజలు సేదదీరేందుకు పట్టణంలో ఒక్క పార్కు కూడా లేదు. దీంతో ప్రజలు ఆహ్లాదానికి, అనుభూతికి నోచుకోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పట్టణంలోని గోసముద్రంను మినీ ట్యాంక్‌బండ్‌గా చేస్తున్నారని తెలిసి ప్రజలు సంతోషించారు.  2016లో ప్రారంభమైన పనులు ఇంకా ఆగుతూ.. సాగుతూనే ఉన్నాయి. డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి 2016లో మినీ ట్యాంక్‌ బండ్‌ పనులకు శంకుస్థాపనచేశారు. పనుల్లో భాగంగా రెండు చెరువు కట్టలను 40 అడుగులకు విస్తరించారు. ఇప్పటి వరకు కట్టపై మట్టిపోసి బలోపేతం చేశారు. గోసముద్రం చెరువుకు సంబంధించి మూడు తూములను, పిట్లం చెరువు నుంచి ఒక తూమును తొలగించి అధునాతన పద్ధతిలో పిట్లం చెరువు వద్ద రిట్నరింగ్‌ గోడను నిర్మించారు. ఈ పనులు చేపట్టేందుకు రెండు నెలలు పట్టింది. ఏవో కారణాలతో కొంతకాలం కాంట్రాక్టర్‌ పనులు నిలిపివేశాడు. పట్టణంలోని మురికి నీరు పిట్లం చెరువులో కలుస్తుంది. మినీ ట్యాంక్‌బండ్‌గా తీర్చిదిద్దుతున్న నేపథ్యంలో మురుగునీరు చెరువులో కలవకుండా భూగర్భ మురికి కాల్వలను నిర్మించారు. ఇందుకోసం పైప్‌లైన్లను తెప్పించారు. ఈ పనులు నెమ్మదిగా జరుగుతున్నాయి. రెండు చెరువు కట్టలకు విస్తరణ కోసం వేసిన మట్టి పలుచోట్ల అప్పుడే బీటలు వారింది. చెరువుల చుట్టూ వాకింగ్‌ ట్రాక్‌ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. ఇంకా మెట్ల పనులు ప్రారంభానికి నోచుకోలేదు. ఆహ్లాదం కోసం పచ్చిక బయళ్లు, వీధి దీపాలు, బోటింగ్, ఫుట్‌పాత్, పిల్లల ఆట వస్తువులు ఇవన్నీ ఏర్పాటు చేయాల్సి ఉంది.

కౌడిపల్లిలో బ్యూటిఫికేషన్‌ పనులు పెండింగ్‌
కౌడిపల్లిలోని పెద్ద చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేశారు. ఇందుకోసం ఇప్పటి వరకు రూ.4.48 కోట్ల నిధులు వెచ్చించారు. ఇరిగేషన్‌ అధికారుల సమాచారం ప్రకారం నిధులు విడుదలైన మేరకు పనులు పూర్తయ్యాయి. అయితే వాస్తవంగా ఇంకా మినీ ట్యాంక్‌ బండ్‌ బ్యూటిఫికేషన్, సీసీ పనులు మిగిలి ఉన్నాయి. అధికారులు పనులు పూర్తయ్యాయని చెబుతున్నా పెద్దచెరువు కట్టకు ఇంకా మినీ ట్యాంక్‌ బండ్‌ల పూర్తి స్వరూపం రాలేదు.

పెద్ద చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చేందుకు కట్టకు ఇరువైపులా రెండు అలుగులు నిర్మించారు. పెద్దతూం, మిర్రతూంలను కొత్తగా నిర్మించారు. అలుగుపై  కట్టపై రెండు వైపుల సీసీతో దిమ్మెను వేశారు. దీంతోపాటు కట్టపైకి వాహనాలు వెళ్లేందుకు సీసీ రోడ్డును ఏర్పాటు చేశారు. రెండు కల్వర్టులు, రెండు బతుకమ్మ ఘాట్లతోపాటు కట్టపైకి ఎక్కేందుకు మెట్లు నిర్మించారు. అలుగుపై నుంచి వాహనాలు వెళ్లేందుకు వీలుగా బ్రిడ్జ్‌ నిర్మించి రెండు వైపులా పైప్‌లు అమర్చారు. కానీ ఇంకా బ్రిడ్జ్‌ వద్ద మట్టిని పూర్తిస్థాయిలో పోయలేదు. చెరువు కట్ట లోపలి వైపు నీటితాకిడికి మట్టికొట్టుకుపోకుండా ఉండేందుకు రాళ్ల తెట్టెను పేర్చి పైనుండి సిమెంట్‌ వేశారు. ట్యాంక్‌బండ్‌ నిర్మాణం పనుల్లో నాణ్యతను పాటించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. దీనికితోడు అంచనా కంటే ఎక్కువ డబ్బులు ఖర్చు చేస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.

గార్డెన్‌ పనులు మిగిలాయి
చెరువు మినీ ట్యాంక్‌ బండ్‌ అభివృద్ధి పనులు జరుగుతుండగా పూడికతీత పనులు ఇప్పటివరకు చేపట్టలేదు. చెరువు కట్టపై పార్క్‌ ఏర్పాటు, సీసీ పనులు మిగిలి ఉన్నాయి. స్థానిక ఎమ్మెల్యే ఇప్పటికే రూ 4.48 కోట్ల నిధులు మంజూరు చేయించగా మరో రూ. 2 కోట్లు మంజూరు చేయించి మిగతా పనులు చేయిస్తామని పలుమార్లు తెలిపారు. ఇప్పటివరకు మంజూరైన నిధులతో పనులు పూర్తిచేశామని, అదనపు  నిధులు మంజూరు కాగానే బ్యూటిఫికేషన్‌ ఇతర పనులు ప్రారంభించనున్నట్లు ఇరిగేషన్‌ ఏఈ నాగరాజు తెలిపారు. ఇదిలా ఉంటే చెరువు కట్ట అభివృద్ధి పనుల్లో భాగంగా నష్టపోయిన రైతులు పరిహారం కోసం ఎదురు చూస్తున్నారు. వారికి పరిహారం అందించే విషయమై తమకెలాంటి ఆదేశాలు రాలేదని కౌడిపల్లి ఇన్‌చార్జి తహసీల్దార్‌ శ్రీశైలం స్పష్టం చేశారు.

తూప్రాన్‌లో 80శాతం పనులు పూర్తి
తూప్రాన్‌ పెద్ద చెరువు కట్టను మినీ ట్యాంక్‌ బండ్‌గా ఏర్పాటు చేసేందుకు 2016 ఆగస్టులో ప్రభుత్వం రూ.5.70కోట్ల నిధులు కేటాయించింది. అదే ఏడాది డిసెంబర్‌లో పనులు ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 80 శాతం పనులు పూర్తయ్యాయి. ఇంకా 20 శాతం పనులు పూర్తి కావాల్సి ఉంది. ఇదిలా ఉంటే చెరువు కట్ట మరమ్మతులు జరుగుతున్నా కట్టపైకి వెళ్లాల్సిన చోట చెరువు మత్తడి ఉండడంతో వర్షకాలంలో పైకి వెళ్లలేని పరిస్థితి.  దీనికి స్పందించిన మంత్రి హరీశ్‌రావు, ఎంపీ ప్రభాకర్‌రెడ్డిలు మత్తడి పైన వంతెన నిర్మాణం కోసం రూ. 4కోట్లు, చెరువు కట్ట సుందరీకరణ కోసం టూరిజం శాఖ నుంచి అదనంగా మరో రూ.2కోట్ల నిధులను కేటాయించారు. అయితే ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాలేదు. మూడేళ్లు కావస్తున్నా పనులు పూర్తి కాకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. త్వరగా పనులు పూర్తి చేసి అందరికీ ఆహ్లాదకర వాతావరణం అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుకుంటున్నారు. 

మినీ ట్యాంక్‌ బండ్‌ పనుల ఆలస్యంపై కలెక్టర్‌ అసంతృప్తి
సాక్షి, మెదక్‌:మెదక్‌ పట్టణంలోని మినీ ట్యాంక్‌ బండ్‌ అభివృద్ధి పనులను శుక్రవారం కలెక్టర్‌ ధర్మారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. గోసముద్రం చెరువు కట్టపై నడుస్తూ మినీ ట్యాంక్‌బండ్‌ నిర్మాణం కోసం చేపడుతున్న పనులను పరిశీలించారు. బతుకమ్మ ఘాట్‌ నిర్మాణం, పార్కు, వాకర్స్‌ జోన్‌ నిర్మాణం పనులపై ఆరా తీశారు. ట్యాంక్‌ బండ్‌ నిర్మాణం పనులకు సంబంధించిన మ్యాప్‌లను పరిశీలించారు.  ఇరిగేషన్‌ ఈఈ ఏసయ్య మినీ ట్యాంక్‌బండ్‌ నిర్మాణం పనుల పురోగతిని కలెక్టర్‌కు వివరించారు. పనులను పరిశీలించిన అనంతరం కలెక్టర్‌ ధర్మారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. మినీ ట్యాంక్‌ బండ్‌ నిర్మాణం ఆశించిన స్థాయిలో సాగడం లేదన్నారు. పనులు మందకొడిగా సాగుతున్నాయని, వేగం పెంచాలని ఇరిగేషన్‌ అధికారులకు సూచించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top